విజేత.. సైనా నెహ్వాల్‌

27 Jan, 2019 15:51 IST|Sakshi

గాయం నుంచి కరోలినా ఔట్‌

ఈ ఏడాది తొలి టైటిల్‌ను ఖాతాలో వేసుకున్న సైనా 

జకార్తా:  ఇండోనేసియా మాస్టర్స్‌ వరల్డ్‌ సూపర్‌-500 టోర్నమెంట్‌ విజేతగా భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ సైనా నెహ్వాల్‌ నిలిచింది. స్పెయిన్ షట్లర్ కరోలినా మారిన్‌తో ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో తలపడిన సైనా నెహ్వాల్.. గేమ్ ముగియకుండానే టైటిల్‌‌ని ఖాతాలో వేసుకుంది. ఆట ప్రారంభం నుంచి దూకుడు ప్రదర్శించిన కరోలినా.. సైనాపై ఆధిపత్యం ప్రదర్శించింది. ఓ దశలో 7-2తో ఆధిక్యంలో ఉన్న సమయంలో కరోలినా కాలికి గాయం అవడంతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యింది. 

ప్రాథమిక చికిత్స అనంతరం మ్యాచ్‌ తిరిగి ప్రారంభించిన కరోలినా మరో రెండు పాయింట్లు సాధించన అనంతరం మరోసారి గాయం తిరగబెట్టడంతో ఫైనల్‌ పోరు నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించింది.  దీంతో టోర్నీ నిర్వాహకులు సైనా నెహ్వాల్‌ను విజేతగా ప్రకటించారు. ఈ టైటిల్‌ గెలవడంతో ఈ ఏడాది తొలి మాస్టర్స్‌ టైటిల్‌ను సైనా తన ఖాతాలో వేసుకుంది. మలేషియా మాస్టర్స్‌ సెమీఫైనల్‌లో సైనా.. కరోలినా చేతిలో ఓడిన విషయం తెలిసిందే.  గతేడాది కూడా ఇండోనేసియా మాస్టర్స్‌ ఫైనల్‌ చేరిన సైనా తుది పోరులో ఓటమి చవిచూసింది.

మరిన్ని వార్తలు