ఆ మ్యాచ్‌ ఓడిపోవడమే కలిసొచ్చింది!

30 Jun, 2019 20:34 IST|Sakshi

లండన్‌: ప్రస్తుత వరల్డ్‌కప్‌లో సెమీ ఫైనల్‌కు చేరిన తొలి జట్టు ఆసీస్‌. డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగిన ఆసీస్‌ అంచనాలకు తగ్గట్టుగానే రాణిస్తోంది. ఇప్పటివరకూ ఎనిమిది మ్యాచ్‌లు ఆడిన ఆసీస్‌ ఏడింట విజయం సాధించి పాయింట్ల పట్టికలో టాపర్‌గా ఉంది. శనివారం న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో సాధారణ టార్గెట్‌ను సైతం కాపాడుకుని ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌ తర్వాత ఆసీస్‌ ప్రధాన పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌ మాట్లాడుతూ.. భారత్‌పై తమ జట్టు ఓడిపోవడాన్ని ప్రధానంగా ప్రస్తావించాడు. భారత్‌పై ఓటమి తర్వాత ఆటగాళ్లలో కసి పెరిగిందని, అదే తమ వరుస విజయాలకు కారణమన్నాడు.

‘భారత్‌తో మ్యాచ్‌ జరిగిన దగ్గర్నుంచీ చూస్తే మేము పుంజుకున్న తీరు నిజంగా ప్రశంసనీయం.  భారత్‌పై ఓటమి మాకు ఒక గుణపాఠం. ఆ మ్యాచ్‌లో ఓడిపోవడం కచ్చితంగా టర్నింగ్‌ పాయింట్‌ అనే చెప్పాలి. టీమిండియాపై చేసిన పొరపాట్లను త్వరగానే సరిచేసుకున్నాం. అక్కడ్నుంచి మా ఎటాకింగ్‌ గేమ్‌ క్రమేపీ పెరుగుతూ ఉంది. అటు బ్యాటింగ్‌లోనూ ఇటు బౌలింగ్‌లోనూ దూకుడు కనబడుతుంది. మా అత్యుత్తమ ప్రదర్శన బయటకు రావడానికి భారత్‌పై పరాజయం చెందడమే. అదొక టర్నింగ్‌ పాయింట్‌’ అని స్టార్క్‌ పేర్కొన్నాడు.


 

మరిన్ని వార్తలు