పాక్‌ను తప్పించడం సాధ్యం కాదు

22 Feb, 2019 09:07 IST|Sakshi

ఆడకపోతే మనకే నష్టం

భారత మాజీ కెప్టెన్‌ గవాస్కర్‌

ముంబై: పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో పాక్‌తో అంతర్జాతీయ టోర్నీల్లోనూ భారత క్రికెట్‌ జట్టు ఆడకూడదని దేశవ్యాప్తంగా డిమాండ్లు వస్తున్న సంగతి తెలిసిందే. దీనికి కొందరు మాజీ క్రికెటర్లు సైతం మద్దతు పలికారు. మరోవైపు రాబోయే వన్డే వరల్డ్‌కప్‌లో పాక్‌తో ఆడకపోవడం అటుంచితే, దాయాది జట్టును ఈ మెగా టోర్నీ నుంచే తప్పిం చాలని బీసీసీఐ యోచిస్తోంది. అయితే అది సాధ్యం కాదని భారత మాజీ కెప్టెన్‌ సునీల్‌ గవాస్కర్‌ అన్నాడు. గురువారం మీడియాతో మాట్లాడిన గవాస్కర్‌ ‘ప్రపంచకప్‌లో పాక్‌ పాల్గొనకుండా బీసీసీఐ ప్రయత్నించవచ్చు. కానీ అది సాధ్యం కాదు. ఎందుకంటే దీనికి ఇతర సభ్య దేశాలూ అంగీకరించాలి. ఇది మీ రెండు దేశాల వ్యవహారం. ఇందులోకి మమ్మల్ని లాగొద్దు అని వాళ్లు అంటే పాకిస్థాన్‌ను తప్పించలేరు.

ఐక్యరాజ్యసమితిలోనే ఈ అంశం తేల్చుకోవాలి. అదే సరైన వేదిక’ అని గవాస్కర్‌ స్పష్టం చేశాడు. ఇక వరల్డ్‌కప్‌లో పాక్‌తో ఆడకూడదని భారత్‌ నిర్ణయిస్తే అది మనకే నష్టమని ఆయన అభిప్రాయపడ్డాడు. ‘ ఇప్ప టికే పాక్‌తో ద్వైపాక్షిక సిరీస్‌ ఆడకపోవడం వల్ల ఆ దేశానికి భారీ నష్టం వాటిల్లుతోంది. అది చాలు. కానీ వరల్డ్‌కప్‌లాంటి టోర్నీలో పాక్‌ కు అనవసరంగా పాయింట్లు ఇవ్వకూడదు. వాళ్లను ఓడించి సెమీ ఫైనల్‌కు రాకుండా చేయాలి. పాక్‌తో ఆడకున్నా క్వాలిఫై అయ్యే సత్తా టీమిండి యాకు ఉంది. కానీ ఉత్త పుణ్యానికి పాక్‌కు ఎం దుకు పాయింట్లు ఇవ్వాలి. అయితే,  ప్రభుత్వం, దేశం ఏది నిర్ణయిస్తే దానిని నేను స్వాగతిస్తాను. కానీ పాక్‌తో వరల్డ్‌కప్‌లో ఆడకపోతే మనకే నష్టమనేది మాత్రం వాస్తవం’అని గవాస్కర్‌ స్పష్టం చేశాడు.

ఇమ్రాన్‌.. ఇదేనా నయా పాకిస్థాన్‌?
ఒకప్పుడు క్రికెట్‌ ఫీల్డ్‌లో  ఇమ్రాన్‌ ఖాన్‌కు గవాస్కర్‌ మంచి స్నేహితుడు. ఇప్పుడా స్నేహం ఇచ్చిన చొరవతో ఇమ్రాన్‌కు కొన్ని సూచనలు చేశాడు గవాస్కర్‌. ‘శాంతి ప్రక్రియలో ఇండియా ఒక అడుగు వేస్తే.. పాక్‌ రెండు అడుగులు వేస్తుంది అన్నావు కదా.. ఆ అడుగులేదో ముందు నువ్వే వెయ్‌.. ఆ తర్వాత ఇండియా ఎన్ని అడుగులు వేస్తుందో చూడు. పుల్వామా లాంటిదాడులకు పాల్పడిన ఉగ్రవాదులను భారత్‌కు అప్పగించు.. సీమాంతర ఉగ్రవాదాన్ని ఆపెయ్‌.. చొరబాట్లను కట్టడి చెయ్‌.. అప్పుడు భారత్‌ ఎన్ని అడుగులు వేస్తుందో చూడు’ అంటూ ఇమ్రాన్‌కు సూచించాడు.

మరిన్ని వార్తలు