విజేతలు తానియా, అనిరుధ్‌

23 Oct, 2018 08:15 IST|Sakshi

స్టేట్‌ ర్యాంకింగ్‌ టెన్నిస్‌ టోర్నీ  

సాక్షి, హైదరాబాద్‌: స్టేట్‌ ర్యాంకింగ్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో జి. తానియా సరయ్, బి. అనిరుధ్‌ చాంపియన్‌లుగా నిలిచారు. బేగంపేట్‌లోని ఏస్‌ టెన్నిస్‌ అకాడమీ వేదికగా జరిగిన ఈ టోర్నీలో అండర్‌–14 బాలబాలికల విభాగాల్లో వీరిద్దరు టైటిళ్లను కైవసం చేసుకున్నారు. బాలుర సింగిల్స్‌ ఫైనల్లో అనిరుధ్‌ 6–3తో వి. ప్రణవ్‌పై గెలుపొందగా... హోరాహోరీగా సాగిన బాలికల సింగిల్స్‌ తుదిపోరులో తానియా 6–5 (7/1)తో ఎం. భారతిని ఓడించింది. అండర్‌–12 కేటగిరీలోనూ తానియా విజేతగా నిలిచింది.

ఫైనల్లో తానియా 6–4తో రిషితా రెడ్డిపై గెలుపొందింది. బాలుర ఫైనల్లో శౌర్య 6–4తో డి. నిఖిల్‌పై నెగ్గాడు. అండర్‌–10 కేటగిరీలో తేజస్‌ సింగ్, మరియా వైజ్‌ టైటిళ్లను దక్కించుకున్నారు. బాలుర సింగిల్స్‌ టైటిల్‌ పోరులో తేజస్‌ 6–3తో శశాంక్‌పై, బాలికల తుదిపోరులో మరియా 6–4తో సాయి అనన్యపై విజయం సాధించారు.

మరిన్ని వార్తలు