టీమిండియాకు నిండైన ప్రాక్టీస్‌

19 Aug, 2019 06:08 IST|Sakshi

సెంచరీ బాదిన చతేశ్వర్‌ పుజారా

రాణించిన ఇషాంత్, ఉమేశ్, కుల్దీప్‌

కూలిడ్జ్‌ (అంటిగ్వా): కరీబియన్‌ పర్యటనలో టెస్టు సిరీస్‌కు ముందు టీమిండియాకు బ్యాటింగ్, బౌలింగ్‌ విభాగాల్లో సరైన ప్రాక్టీస్‌ లభించింది. వెస్టిండీస్‌ ‘ఎ’తో ఇక్కడ జరుగుతున్న మూడు రోజుల మ్యాచ్‌లో మన జట్టు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. కీలక బ్యాట్స్‌మన్‌ పుజారా (187 బంతుల్లో 100 రిటైర్డ్‌ నాటౌట్‌; 8 ఫోర్లు, సిక్స్‌) సెంచరీ; తెలుగు ఆటగాడు హనుమ విహారి (101 బంతుల్లో 37 నాటౌట్‌; 2 ఫోర్లు); రిషభ్‌ పంత్‌ (53 బంతుల్లో 33; 4 ఫోర్లు, సిక్స్‌)రాణించడంతో భారత్‌ తొలి రోజు శనివారం 5 వికెట్ల నష్టానికి 297 పరుగులు చేసింది. ఇదే స్కోరు వద్ద డిక్లేర్‌ చేసింది. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభిం చిన విండీస్‌ ‘ఎ’ను పేసర్లు ఇషాంత్‌ శర్మ (3/21), ఉమేశ్‌ యాదవ్‌ (3/19); స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ (3/35) కుప్పకూల్చారు. దీంతో ప్రత్యర్థి టీ విరామానికి ముందు 56.1 ఓవర్లలో 181 పరుగులకు ఆలౌటైంది. ఆ జట్టులో ఓపెనర్‌ హడ్జ్‌ (51) అర్ధసెంచరీ సాధించాడు. భారత్‌కు 116 పరుగుల ఆధిక్యం లభించింది.  

మరిన్ని వార్తలు