సచిన్‌ సరికొత్త చాలెంజ్‌

29 Jun, 2018 13:43 IST|Sakshi

ముంబై: కేంద్ర క్రీడాశాఖ మంత్రి రాజ్యవర్థన్‌ సింగ్ రాథోడ్ 'హమ్ ఫిట్ తో ఇండియా ఫిట్' పేరుతో ఇటీవల ఓ చాలెంజ్‌ని విసిరిన సంగతి తెలిసిందే. ఈ చాలెంజ్‌ను పలువురు క్రీడాకారులతో పాటు సినిమా సెలబ్రిటీలు, ప్రధాన నరేంద్ర మోదీ సైతం స్వీకరించి అందుకు సంబంధించిన వీడియోలను పోస్టు చేసిన సంగతి తెలిసిందే. ఇది దేశవ్యాప్తంగా బాగా వైరల్ అయింది.

అయితే, తాజాగా అలాంటి చాలెంజ్‌‌నే క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ అభిమానుల ముందుకు తీసుకొచ్చారు. ఈ చాలెంజ్ పేరు 'కిట్ అప్‌ చాలెంజ్'‌. ఈ చాలెంజ్‌ని స్వీకరించిన వారు తమకిష్టమైన ఆట ఆడుతూ దానికి సంబంధించిన వీడియోను షేర్‌ చేయాలి.

ఈ సందర్భంగా సచిన్ టెండూల్కర్ మాట్లాడుతూ నాకు చిన్నప్పటి నుంచి ఆటలు ఆడటం అంటే ఇష్టం. ముఖ్యంగా క్రికెట్ అంటే ఎక్కువ ఇష్టం. ఇప్పుడు ఈ చాలెంజ్‌ రాథోడ్ సవాల్‌కు పొడిగింపుగా ఉంటుంది అని తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేస్తూ దీనికి కొంతమంది ప్రముఖుల పేర్లను ట్యాగ్ చేశారు.

"నేను నాకు ఇష్టమైన క్రికెట్ ఆడి వీడియోను షేర్‌ చేశాను. మీరు మీకిష్టమైన ఆట ఆడి మీరు మీ వీడియోలను షేర్‌ చేయండి. మీరందరు ఎప్పుడు ఫిట్‌గా ఉండాలనుకుంటున్నాను’ అని సచిన్‌ కామెంట్ పెట్టారు. తాను క్రికెట్ ఆడుతోన్న వీడియోను షేర్‌ చేయడంతోపాటు భారత క్రీడాకారులు సర్దార్ సింగ్, పీవీ సింధు, మిథాలీ రాజ్‌, విజేందర్ సింగ్, కిదాంబి శ్రీకాంత్, విరాట్ కోహ్లి పేర్లను ట్యాగ్ చేశారు.

మరిన్ని వార్తలు