నువ్వు లేకుండా.. ప్రపంచకప్‌ గెలవడమా?

13 Jul, 2019 17:27 IST|Sakshi

హైదరాబాద్ ‌: టీమిండియా సారథి విరాట్‌ కోహ్లి, మాజీ లెజెండ్‌ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌లు దక్షిణాఫ్రికా మాజీ విధ్వంసకర ఆటగాడు ఏబీ డివిలియర్స్‌కు బాసటగా నిలిచారు. ప్రపంచకప్‌ సమయంలో దక్షిణాఫ్రికా జట్టులోకి తిరిగి ఎంట్రీ ఇవ్వాలని డివిలియర్స్‌ ప్రయత్నం చేశాడంటూ పెద్ద దుమారమే రేగింది. దీనిపై తాజాగా సోషల్‌ మీడియా వేదికగా డివిలియర్స్‌ స్పందించాడు. జట్టులోకి రావడానికి తాను డిమాండ్‌ చేయలేదని స్పష్టం చేశాడు. అంతేకాకుండా అనేక విషయాలను వివరిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఆవేదన వ్యక్తం చేశాడు. 

అయితే డివిలియర్స్‌ మెసేజ్‌పై కోహ్లి రియాక్ట్‌ అయ్యాడు. ’మై డియర్‌ బ్రదర్‌ నవ్వు నిజాయితీ, నిబద్దత కలిగిన వ్యక్తవని నాకు తెలుసు. కానీ నీ విషయంలో ఇలా జరుగుతుండటం విచారకరం. నీ వ్యక్తిగత విషయాన్ని కొందరు బహిరంగం చేశారు. నువ్వు, నీ కుటుంబ సభ్యులు ప్రేమానురాగాలతో పాటు ధైర్యంగా ఉండాలి. నీ పైన నాకు, అనుష్కకు పూర్తి నమ్మకం ఉంది. నీ వెంట మేమున్నాము’అంటూ డివిలియర్స్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో కోహ్లి పేర్కొన్నాడు.   

ఇక టీమిండియా మాజీ ఆటగాడు యువరాజ్‌ సింగ్‌ కూడా ఈ వివాదంపై స్పందించాడు. ‘నేను క్రికెట్‌ ఆడిన రోజుల్లో లెజెండ్‌ అండ్‌ అత్యుత్తమ ఆటగాళ్లలో డివిలియర్స్‌ ఒకరు. నువ్వు లేని దక్షిణాఫ్రికా ప్రపంచకప్‌ గెలిచేందుకు ఒక్క అవకాశం లేదు. మంచి, అత్యుత్తమ ఆటగాళ్లపైనే ఎక్కువగా విమర్శలు వస్తాయి. వాటన్నింటిని నువ్వు పట్టించుకోకు. డివిలియర్స్‌ ఎలాంటి వ్యక్తో ప్రపంచానికి తెలుసు’ అంటూ యువరాజ్‌ సింగ్‌ పేర్కొన్నాడు. ఇక 2018, మే నెలలో డివిలియర్స్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌ బై చెప్పిన విషయం తెలసిందే. కేవలం క్రికెట్‌ లీగ్‌ల్లో మాత్రమే ఆడతానిని స్పష్టం చేశాడు.

మరిన్ని వార్తలు