విరాట్‌ కోహ్లి మరో రికార్డు

17 Jul, 2018 18:21 IST|Sakshi

లీడ్స్‌: ఇప్పటికే ఎన్నో రికార్డులను కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి మరో ఘనతను సొంతం చేసుకున్నాడు. అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో మూడు వేల వన్డే పరుగులు  సాధించిన కెప్టెన్‌గా విరాట్‌ రికార్డు సాధించాడు. ఒక జట్టు కెప్టెన్‌గా కోహ్లి కేవలం 49 ఇన్నింగ్స్‌ల్లోనే మూడు వేల వన్డే పరుగుల మార్కును చేరిన ఘనతను సాధించాడు. ఇంగ్లండ్‌తో  చివరిదైన మూడో వన్డేలో విరాట్‌ ఈ రికార్డు నమోదు చేశాడు.

ఒక కెప్టెన్‌గా వన్డేల్లో మూడు వేల పరుగుల సాధించడానికి అతి తక్కువ ఇన్నింగ్స్‌లు ఆడిన వారిలో విరాట్‌ కోహ్లి తర్వాత స్థానంలో ఏబీ డివిలియర్స్‌ ఉన్నాడు. ఈ  ఫీట్‌ను ఏబీ డివిలియర్స్‌ సాధించడానికి 60 ఇన్నింగ్స్‌లు అవసరమయ్యాయి. ఆపై ఎంఎస్‌ ధోని(70 ఇన్నింగ్స్‌లు), సౌరవ్‌ గంగూలీ(74 ఇన్నింగ్స్‌లు), గ‍్రేమ్‌ స్మిత్‌-మిస్బావుల్‌ హక్‌(83 ఇన్నింగ్స్‌లు), జయసూర్య-పాంటింగ్‌(84 ఇన్నింగ్స్‌లు) వరుస స్థానాల్లో ఉన్నారు. ఇంగ్లండ్‌తో సిరీస్‌ నిర్ణయాత్మక వన్డేలో భారత జట్టు ముందుగా బ్యాటింగ్‌కు దిగింది. టాస్‌ గెలిచిన ఇంగ్లండ్‌.. టీమిండియాను బ్యాటింగ్‌ ఆహ్వానించింది. దాంతో భారత జట్టు ఇన్నింగ్స్‌ను రోహిత్‌ శర్మ-శిఖర్‌ ధావన్‌లు ఆరంభించారు. రోహిత్‌ శర్మ(2) తొలి వికెట్‌గా పెవిలియన్‌ చేరిన తర్వాత కోహ్లి బ్యాటింగ్‌కు దిగాడు.

మరిన్ని వార్తలు