వరల్డ్‌కప్‌ సెమీస్‌ అంటే కోహ్లికి వణుకే!

10 Jul, 2019 16:29 IST|Sakshi

మాంచెస్టర్‌: ప్రస్తుత వన్డే వరల్డ్‌కప్‌లో న్యూజిలాండ్‌తో తొలి సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లో భారత్‌  తలపడుతున్న సంగతి తెలిసిందే. మంగళవారం నాడు జరగాల్సిన మ్యాచ్‌ పూర్తిగా జరగకపోవడంతో రిజర్వ్‌ డే అయిన బుధవారం నాటికి వాయిదా పడింది. దాంతో కివీస్‌ తన ఇన్నింగ్స్‌ను ఎనిమిది వికెట్ల నష్టానికి 239 పరుగుల వద్ద ముగించింది. అయితే ఆ తర్వాతే అసలు సిసలు సమరం ఆరంభమైంది. కివీస్‌ నిర్దేశించిన టార్గెట్‌ 240 పరుగులకే కదా భారత్‌ సునాయాసంగా కొట్టేస్తుందులే అనుకుంటే అది కాస్తా పీకలమీదుకు వచ్చింది.  టీమిండియా ఐదు పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయింది.

రోహిత్‌ శర్మ(1), కోహ్లి(1), కేఎల్‌  రాహుల్‌(1)లు తలో పరుగు చేసి పెవిలియన్‌ చేరారు. కాగా, వరల్డ్‌కప్‌ నాకౌట్‌ మ్యాచ్‌ల్లో భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి విఫలమం కావడం చర్చనీయాంశంగా మారింది. వరల్డ్‌కప్‌ల్లో నాకౌట్‌ మ్యాచ్‌లు ఆడాలంటే కోహ్లి వణికిపోతాడని అభిమానులు విమర్శిస్తున్నారు. 2011 వరల్డ్‌కప్‌లో భాగంగా పాకిస్తాన్‌తో జరిగిన సెమీ ఫైనల్లో కోహ్లి 9 పరుగులకే చేసి పెవిలియన్‌ చేరగా, 2015 వరల్డ్‌కప్‌లో భాగంగా ఆసీస్‌తో జరిగిన సెమీస్‌లో కోహ్లి పరుగు మాత్రమే చేశాడు. తాజా వరల్డ్‌కప్‌లో న్యూజిలాండ్‌తో సెమీస్‌లో కోహ్లి పరుగుకే పరిమితమయ్యాడు. ఈ మూడు వరల్డ్‌కప్‌ సెమీ ఫైనల్లోనూ లెఫార్మ్‌ పేసర్లకే కోహ్లి వికెట్‌ సమర్పించుకోవడం గమనించాల్సిన విషయం.

2011వరల్డ్‌కప్‌ సెమీస్‌లో వహాబ్‌ రియాజ్‌ బౌలింగ్‌లో కోహ్లి ఔట్‌ కాగా, 2015 వరల్డ్‌కప్‌ సెమీస్‌లో మిచెల్‌ జాన్సన్‌ చేతికి చిక్కాడు కోహ్లి. ఇక ఈ వరల్డ్‌కప్‌ సెమీస్‌లో  ట్రెంట్‌ బౌల్ట్‌ బౌలింగ్‌లో ఎల్బీగా ఔటయ్యాడు. దాంతో కోహ్లిని దుమ్మెత్తిపోస్తున్నారు నెటిజన్లు. అసలు సిసలు సమరంలోకి వచ్చేసరికి కోహ్లి తేలిపోతాడంటూ మండిపడుతున్నారు. ఐసీసీ నిర్వహించే మేజర్‌ టోర్నీలో కోహ్లి రాణించిన దాఖలాలు లేకపోవడంతో అతనిపై తీవ్ర స్థాయిలో విమర్శల వర్షం కురుస్తోంది. ఓవర్‌గా వరల్డ్‌కప్‌ నాకౌట్‌ మ్యాచ్‌ల్లో కోహ్లి చేసిన పరుగులు 73. ఇక్కడ కోహ్లి యావరేజ్‌ 12.16గా ఉండటం గమనార్హం. చాంపియన్స్‌ ట్రోఫీలో ఫైనల్లో కూడా కోహ్లి విఫలమైన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు