నటి వింద్యపై చెప్పులతో దాడి

30 Apr, 2016 02:47 IST|Sakshi
నటి వింద్యపై చెప్పులతో దాడి

టీనగర్: తిరువారూరు సమీపాన నటి వింద్య ఎన్నికల ప్రచారం చేస్తుండగా అన్నాడీఎంకే కార్యకర్తలు చెప్పులు విసరడంతో సంచలనం ఏర్పడింది. తిరువారూరు జిల్లా, నన్నిలం నియోజకవర్గంలో రెండవ సారిగా పోటీ చేస్తున్న మంత్రి కామరాజ్‌కు మద్దతుగా వలంగైమాన్, కుడవాసన్, నన్నిలం ప్రాంతాలలో నటి వింద్య బుధవారం రాత్రి ప్రచారం చేశారు. నన్నిలం బస్టాండు సమీపాన జరిగిన ప్రచార సభలో అక్కడ అన్నాడీఎంకే వర్గాలు గుమికూడాయి. ఆ సమయంలో రాత్రి 9.55 గంటలకు అక్కడికి వచ్చిన వింద్య సమయం మించిపోవడంతో తాను మాట్లాడలేనని, క్షమించాలని కోరుతూ తన ప్రసంగాన్ని ఆపారు.

దీంతో ఆగ్రహించిన కార్యకర్తలు కొందరు వింద్యను ఏకపదజాలంతో మాట్లాడారు. కొందరు ఆమెపై పాదరక్షలు విసిరారు. దీంతో అన్నాడీఎంకే వర్గాల మధ్యే ఘర్షణ ఏర్పడింది. దీన్ని అక్కడున్న వీడియో, ఫోటోగ్రాఫర్లు చిత్రీకరించేందుకు ప్రయత్నించగా విద్యుత్ సరఫరా నిలిపివే శారు. దీంతో నటి వింద్య అక్కడి నుంచి దిగాలుగా వెళ్లిపోయింది.

మరిన్ని వార్తలు