అలా కాంగ్రెస్‌ పార్టీలో చేరా !

20 May, 2017 09:16 IST|Sakshi
అలా కాంగ్రెస్‌ పార్టీలో చేరా !

బెంగళూరు : తనను కాంగ్రెస్‌లోకి తీసుకురావటంలో పలువురు నాయకులు ఒత్తడి తెచ్చినట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు.  బెంగళూరు ప్రెస్‌క్లబ్, జర్నలిస్ట్‌ గిల్డ్‌ సంయుక్తంగా నిర్వహించిన మీట్‌ ది ప్రెస్‌లో ఆయన నిన్న (శుక్రవారం) మాట్లాడారు.

‘కాంగ్రెస్‌ పార్టీలోకి రాకముందు జాతీయ స్థాయిలో ఏఐపీజేడీ పార్టీని తీసుకురావాలని ఉద్దేశించిన సందర్భంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి అహమ్మద్‌ పటేల్‌ కలిశారు. తనను నేరుగా కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ వద్దకు  అహమ్మద్‌ పటేల్‌ తీసుకెళ్లారు. మేడమ్‌ సోనియాగాంధీ మతతత్వ పార్టీలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న తామంతా కలసి పనిచేయాలని సూచించారు. దీనికి అంగీకరించి సోనియాగాంధీ సమక్షంలోనే బెంగళూరు ప్యాలెస్‌ మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరా’నని ఆయన తెలిపారు.

సోనియాగాంధీని కలిసిన తరువాత మహారాష్ట్ర గవర్నర్‌గా ఉన్న ఎస్.ఎం కృష్ణను కలిసి కాంగ్రెస్‌లో  చేరుతున్నట్లు చెప్పానని విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పారు. రాష్ట్రంలో అధికారంలోకి రాకముందు ప్రజలకిచ్చిన మాట ప్రకారం నడచుకున్నామని, ఇక ముందు కూడా నడచుకొంటామని హామీనిచ్చారు. ఈ నాలుగేళ్ల తమ అధికార అవధిలో 2013 ఎన్నికల సమయంలో ఇచ్చిన 160 హామీల్లో ఇప్పటి వరకు 150 హామీలు నెరవేర్చామని మిగిలిన 10  హామీలను కూడా త్వరలోనే నెరవేరుస్తామని తెలిపారు.

మరిన్ని వార్తలు