ఢిల్లీలోనూ ‘షేమ్‌’ సీన్‌

5 Jan, 2017 15:29 IST|Sakshi
ఢిల్లీలోనూ ‘షేమ్‌’ సీన్‌

న్యూఢిల్లీ: న్యూ ఇయర్‌ వేడుకల సందర్భంగా బెంగళూరులో జరిగిన కీచకపర్వం తరహా ఘటన దేశ రాజధాని ఢిల్లీలోనూ జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ఫుటేజి ఆలస్యంగా వెలుగు చూసింది.

డిసెంబర్‌ 31వ తేదీ రాత్రి ఢిల్లీలోని ముఖర్జీ నగర్‌ ప్రాంతంలో న్యూ ఇయర్‌ వేడుకలు చేసుకునేందుకు దాదాపు 250 మంది విద్యార్థులు ఓ చోట గుమికూడారు. కొందరు మద్యంమత్తులో ఉన్నారు. ఆ సమయంలో ఓ వ్యక్తితో కలసి ఓ మహిళ బైకుపై అటుగా వెళ్తోంది. అందరూ చూస్తుండగానే కొందరు ఆకతాయిలు బైకును ఆపి ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. బైకుపై నుంచి ఆమెను లాగేందుకు ప్రయత్నించగా, ఆమె అరుస్తూ గట్టిగా పట్టుకుంది. అక్కడున్న పోలీసులు వెంటనే పరిగెత్తుకెళ్లి ఆమెను రక్షించేందుకు ప్రయత్నించగా, ఆకతాయిలు వారిపై దాడి చేశారు. పోలీసులపై రాళ్లు విసిరారు. ఈ దాడిలో నలుగురు పోలీసులు గాయపడగా, అక్కడ పార్క్‌ చేసిన కార్లు దెబ్బతిన్నాయి. వెంటనే పోలీసు కంట్రోల్‌ రూమ్‌కు సమాచారం అందించడంతో అదనపు పోలీసు బలగాలు వెళ్లి ఆకతాయిలను అదుపు చేశాయి. బాధితురాలు ఫిర్యాదు చేయలేదని, నిందితులను గుర్తించే పనిలో ఉన్నామని పోలీసులు చెప్పారు.

బెంగళూరులో పార్టీ హబ్‌గా పేరొందిన ఎంజీ రోడ్, బ్రిగేడ్‌ రోడ్, చుట్టుపక్కల ప్రాంతాల్లో న్యూ ఇయర్‌ సంబరాల్లో వేలాది మంది మధ్యలో యువతులు, మహిళలపై ఆకతాయిలు అసభ్య ప్రవర్తనకు, లైంగిక వేధింపులకు పాల్పడన సంగతి తెలిసిందే. కొందరు మహిళలపై భౌతికదాడులకూ దిగారు. రాత్రి 11:45 గంటల నుంచి అర్ధరాత్రి 12:05 గంటల మధ్య యువతులపై అకృత్యాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది.