World Cup Final Match: మ్యాచ్‌ అహ్మదాబాద్‌లో.. ‘రెట్టించిన ఉత్సాహం’ ఢిల్లీలో..

19 Nov, 2023 07:50 IST|Sakshi

ఈరోజు (ఆదివారం) గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో భారత్‌-ఆస్ట్రేలియా జట్ల మధ్య క్రికెట్ ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్  జరగనుంది. ఈ నేపధ్యంలో ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లోని పలు పబ్‌లు, రెస్టారెంట్లలో క్రీడాప్రియులు మ్యాచ్‌ను మరింత ఉత్సాహంతో తిలకించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భారీ టీవీ స్క్రీన్‌లను ఏర్పాటు చేయడం మొదలుకొని ప్రత్యేక పానీయాలు అందించడం వరకు అన్నింటినీ అందుబాటులో ఉంచారు.

ప్రపంచ కప్‌ ఫైనల్‌ను క్యాష్‌ చేసుకునేందుకు ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లోని పలు పబ్‌లు, రెస్టారెంట్‌లు  అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. సెమీ ఫైనల్స్‌లో న్యూజిలాండ్‌ను ఓడించి ఫైనల్‌కు చేరిన టీమ్‌ఇండియా టోర్నీలో ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించడం విశేషం. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. 

ఈ సందర్భంగా ‘ఎస్‌ మినిస్టర్ - పబ్ అండ్ కిచెన్’ ప్రతినిధి మీడియాతో మాట్లాడుతూ ఇది బిగ్ మ్యాచ్ కావడంతో ‘కవర్ ఛార్జీ’గా మూడు వేల రూపాయలు వసూలు చేస్తున్నాం. సాధారణ రోజుల్లో, మేము దీనిని వసూలు చేయం. ఫైనల్‌ మ్యాచ్‌ అయినందున ఇంత రేటును వసూలు చేస్తున్నాం. దీనిని ఆహారానికి అదనంగా చెల్లించాల్సి ఉంటుంది’ అని అన్నారు. కాగా బ్లూ జెర్సీ ధరించి వచ్చే వారి కోసం ‘బీర్ కేఫ్’లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. బీర్ కేఫ్ వ్యవస్థాపకుడు రాహుల్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ ‘టీమ్ ఇండియా ఫైనల్‌కు  చేరడంతో ఆదివారం దేశవ్యాప్తంగా ఉన్న మా అవుట్‌లెట్‌లలో అభిమానులను స్వాగతించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. పెద్ద స్క్రీన్‌లపై మ్యాచ్‌ ప్రత్యక్ష ప్రసారం చేస్తాం. టీమ్ ఇండియా జెర్సీ ధరించి వచ్చిన వారికి ప్రత్యేక ఆఫర్‌లు అందిస్తున్నాం’ అని అన్నారు. 

హర్యానాలోని సైబర్ సిటీ ఆఫ్ గురుగ్రామ్‌లోని ‘సోయి 7 పబ్’, ‘బ్రూవరీ’లలో క్రీడాభిమానులు ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌ను తిలకించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ‘సోయి 7 పబ్’కి చెందిన లలిత్ అహ్లావత్ మాట్లాడుతూ ‘మ్యాచ్‌లను ప్రసారం చేయడానికి మూడు పెద్ద స్క్రీన్‌లు ఏర్పాటు చేశాం. సైబర్ సిటీలో అతిపెద్ద వేదిక ఏర్పాటు చేశాం. భారత జట్టుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం’ అని అన్నారు. 
ఇది కూడా చదవండి: మ్యాచ్‌ తిలకించేందుకు అహ్మదాబాద్‌కు అనుష్క శర్మ

మరిన్ని వార్తలు