చెల్లెలి ప్రేమ పెళ్లి.. అన్నయ్య విషాదాంతం

17 Oct, 2016 15:53 IST|Sakshi
చెల్లెలి ప్రేమ పెళ్లి.. అన్నయ్య విషాదాంతం

తూప్రాన్‌(మెదక్‌): పాతికేళ్లకే కుటుంబానికి పెద్ద దిక్కుగా మారి ఒక్కగానొక్క చెల్లెలికి ఘనంగా పెళ్లి చేయాలని ఏర్పాట్లు చేసిన అన్నయ్యకు చెల్లి ప్రేమ పెళ్లి చేసుకొని షాక్‌ ఇచ్చింది. దీంతో మనస్తాపానికి గురైన అన్న రైలు కిందపడి తనువు చాలించాడు. ఈ సంఘటన మెదక్‌ జిల్లా తూప్రాన్‌ మండలంలోని బ్రాహ్మణపల్లి రైల్వే గేట్‌ వద్ద ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలు.. తూప్రాన్‌కు చెందిన శ్రావణ్‌కుమార్‌ కంప్యూటర్‌ ఆపరేటర్‌గా పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.

చిన్నతనంలోనే తండ్రి చనిపోవడంతో కుటుంబ బాధ్యతలు భుజానికెత్తుకొని బతకు బండిని లాగిస్తున్నాడు. ఈ క్రమంలో తన ఒక్కగానొక్క చెల్లెలికి ఘనంగా పెళ్లి చేయాలనుకొని మంచి సంబంధం చూశాడు. ఈనెల 20 నిశ్చితార్థానికి ఏర్పాట్లు పూర్తిచేశాడు. ఈ సమయంలో ఆదివారం సాయంత్రం శ్రావణ్‌కుమార్‌ చెల్లెలు తాను ప్రేమించిన యువకుడిని పెళ్లి చేసుకొని పోలీసులను ఆశ్రయించింది.

దీంతో పోలీసులు శ్రావణ్‌ను స్టేషన్‌కు పిలిపించి మాట్లాడారు. అల్లారుముద్దుగా చూసుకున్న చెల్లెలు తన పరువు తీసిందని భావించిన శ్రావణ్‌ అర్ధరాత్రి ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. ఈ రోజు ఉదయం రైల్వే గేట్‌ వద్ద మ​ృతదేహం పడి ఉందనే సమాచారంతో అక్కడికి వెళ్లిన కుటుంబసభ్యులు శ్రావణ్‌ మృతదేహాన్ని చూసి బోరున విలపించారు. విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు