సభాపతులు అమ్ముడుపోయారు!

7 Mar, 2017 16:40 IST|Sakshi
సభాపతులు అమ్ముడుపోయారు!
- శాసన మండలి ప్రతిపక్ష నేత రామచంద్రయ్య
 
అమరావతి: సభాపతులు అమ్ముడు పోయారని శాసనమండలి ప్రతిపక్షనేత సి.రామచంద్రయ్య పేర్కొన్నారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో చట్టసభలను కాపాడే బాధ్యత ప్రిసైడింగ్‌ ఆఫీసర్స్‌పై ఉందని, ప్రతి ఒక్కరూ ఏదోఒక పార్టీ టిక్కెట్‌పై పోటీచేసి గెలిచిన వారేనని, కానీ సభాపతి స్థానంలో కూర్చున్న తరువాత నిష్పాక్షికంగా విధి నిర్వహణ చేయాలన్నారు. కానీ సభాపతులు అలా కాకుండా అమ్ముడుపోయిన విధానాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఒక పార్టీ టిక్కెట్‌పై ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు వేరే పార్టీకి కేటాయించిన సీట్లలో కూర్చుంటే ఆహ్వానిస్తున్నారని, కంప్లైంట్‌ ఇచ్చినా చర్యలు తీసుకోవడం లేదని చెప్పారు.
 
యాంటి డిఫెక్షన్‌ బిల్లును నిర్వీర్యం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉండే చట్టసభల్లో ఇద్దరు ప్రిసైడింగ్‌ అధికారులు వినీవిననట్లు ఉంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది తప్పని తాను ప్రతిపక్ష నాయకునిగా చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు. కౌన్సిల్‌లో చాలా ఘోరంగా ఉంది. కాంగ్రెస్‌ పార్టీపై గెలిచిన వారు వేరే పార్టీకి పోతే కంప్లైంట్‌ ఇచ్చినా యాక్షన్‌ తీసుకోలేని పరిస్థితుల్లో ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌ ఉన్నాడంటే ఇందులో మతలబు ఉందన్నారు. పార్టీ నుంచి ఎక్స్‌టెన్షన్లు వస్తాయనో... ఇంకా ఏవైనా లాభాలు వస్తాయో... నాకు తెలియదు కాని ఇటువంటి దిగజారుడు తనం ప్రజాస్వామ్యాన్ని సర్వనాశనం చేస్తుందన్నారు.
 
ప్రిసైడింగ్‌ అధికారి నిర్ణయాలు ఎన్నికల కమిషన్‌ కానీ, పార్లమెంటరీ కమిటీ కానీ రివ్యూ చేసే అధికారాలు ఇవ్వాలని పార్లమెంట్‌కు, రాష్ట్రపతికి లేఖ రాశానన్నారు. గవర్నర్‌ ప్రసంగంపైన మోషన్‌ ఆఫ్‌ థ్యాంక్స్‌ ప్రారంభమైంది. నేను మాట్లాడుతున్నాను. ఉన్న ఫ్యాక్ట్స్‌ చెబుతున్నా. సునిశితమైన వ్యాఖ్యలు ఉంటాయి. ప్రభుత్వం అనేది ప్రజల ఆస్థికి కస్టోడియన్‌. వారు ప్రభుత్వ సంక్షేమానికి డబ్బును ఉపయోగపెట్టకుంటే దానిని గుర్తుచేసే బాధ్యత రాజ్యాంగ పరంగా మాకుందన్నారు. కాబట్టి దాని గురించి చెప్పేందుకు అనుమతించకుంటే ప్రిసైడింగ్‌ అధికారి చట్టసభలో కూర్చునేందుకు అనర్హుడని అన్నారు. తాను మాట్లాడుతుంటే ఒక మంత్రి ఏదో చెప్పబోయారు, వారు సమాధానం చెప్పేటప్పుడు చెప్పమని కోరాను, అయినా నిబంధనలకు విరుద్ధంగా అనుమతించారు. సభాపతి ఇంత దారుణంగా వ్యవహరిస్తారా? అంటూ ప్రశ్నించారు. రూలింగ్‌ పార్టీ వారి కోసం ఇంత దిగజారుడు తనంగా లొంగిపోయే వారు ప్రిసైడింగ్‌ ఆఫీసర్లుగా ఎలా పనికొస్తారని ప్రశ్నించారు. చట్టసభల్లో కార్యాక్రమాలు నిష్పక్షపాతంగా జరగాలన్నారు. రూలింగ్‌ పార్టీ నుంచి లాభం కోసం ఫేవర్‌గా ఉండి రాజకీయాలు చేసే వాతావరణం పోవాలన్నారు. లేకుంటే ప్రజాస్వామ్యం మనుగడ సాధించలేదన్నారు.
 
హౌస్‌లో ఉండే సాంప్రదాయానికి భిన్నంగా వాళ్ళను ఆకర్షించే దానికి, రూల్స్‌కు భిన్నంగా పోతే ఏరకమైన ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌ అనుకోవాలి. దీనిని నేను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ ప్రిసైడింగ్‌ అధికారుల నిర్వాకంపై పార్లమెంట్‌ స్పీకర్‌కు, రాష్ట్రపతికి లేఖ రాస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటి వరకు పార్టీ మారిన వారిపై ఎందుకు యాక్షన్‌ తీసుకోలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పార్టీ టిక్కెట్‌పై ఎన్నుకోబడిన వ్యక్తి తెలుగుదేశం పార్టీకి కేటాయించిన కుర్చీల్లో కూర్చొని మాట్లాడితే పాయింట్‌ అవుట్‌ చేసినా సభాపతి తల తిప్పి చూడటం లేదన్నారు. ఈ అమ్ముడుపోయే విధానాలు ఎందుకు? అంటూ ప్రశ్నలు సంధించారు. ఇటువంటి పరిణామాలు చాలా బాధ కలిగిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
 
మరిన్ని వార్తలు