'సిద్ధుపై పరువునష్టం దావా వేస్తా'

27 Mar, 2017 10:01 IST|Sakshi
'సిద్ధుపై పరువునష్టం దావా వేస్తా'

మైసూరు: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై పరువునష్టం దావా వేస్తానని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప హెచ్చరించారు. నిర్దోషిని అని కోర్టులు తీర్పులిచ్చినా కూడా సిద్ధరామయ్య తనను జైలుకు పోయివచ్చాడని, కేసులున్నాయని అని బహిరంగ సమావేశాల్లో పదేపదే ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆదివారం నంజనగూరు నియోజకవర్గంలో బదనవాళు గ్రామంలో బీజేపీ అభ్యర్థి శ్రీనివాస్‌ ప్రసాద్‌కు మద్దతుగా యడ్యూరప్ప ప్రచారం చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ తనపైన ఉన్న కేసులను కోర్టులు కొట్టివేసినా సిద్దరామయ్య నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.  ఇలాగే మాట్లాడితే ఆయనపై పరువు నష్టం దావా వేస్తానని అన్నారు. సిద్ధు ఆరోపణలకు భయపడబోనని చెప్పారు. దేశంలోనే ఆయన అత్యంత అవినీతిపరుడైన నాయకుడని వ్యాఖ్యానించారు. డైరీల కుంభకోణంపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని యడ్యూరప్ప సవాల్ విసిరారు.

మరిన్ని వార్తలు