ప్రభుత్వం దిగి వచ్చే వరకు రైస్ మిల్లులు బంద్ చేస్తాం

17 Dec, 2013 05:32 IST|Sakshi

= 2 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఇచ్చేందుకు సిద్ధం
 = జిల్లా రైస్ మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షుడు బసవరాజప్ప

 
సాక్షి, బళ్లారి : ప్రభుత్వం అనాలోచిత నిర్ణయంతో రైస్ మిల్లర్ల నుంచి అధిక లెవీ రూపంలో బియ్యాన్ని తీసుకోవాలని నిర్ణయించడం సరైన చర్య కాదని ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ఉప సంహరించుకునేంత వరకు రైస్ మిల్లులను బంద్ చేస్తామని రైస్ మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షుడు బసవరాజప్ప స్పష్టం చేశారు. ఆయన సోమవారం జిల్లా రైస్ మిల్లర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఏపీఎంసీ ఆవరణం నుంచి నగరంలోని ప్రముఖ వీధుల గుండా ర్యాలీగా వచ్చి జిల్లాధికారి కార్యాలయంలో హెచ్‌క్యూకి వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా బసవరాజప్ప మాట్లాడుతూ గత 30 సంవత్సరాల నుంచి  ప్రభుత్వం ప్రతి ఏటా లెవీ రూపంలో 1.25 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సేకరించేదని, అయితే ఉన్న ఫళంగా ఈసారి 13.5 లక్షల మెట్రిక్ టన్నులు తీసుకోవాలని కేబినేట్‌లో నిర్ణయించడం ఎంతవరకు సబబన్నారు. ఈ మార్చిలోపు కనీసం 5 లక్షల మెట్రిక్ టన్నులు ఇవ్వాలని డిమాండ్ చేసిందని, అయితే గతంలో ఇచ్చే 2 లక్షల మెట్రిక్ టన్నుల కంటే ఒక క్వింటాల్ కూడా అదనంగా ఇచ్చేందుకు వీలుకాదన్నారు.

పంట పండించడానికి అధిక పెట్టుబడి వస్తోందని, వరి రేటు మార్కెట్‌లో క్వింటాల్ రూ.2650 ఉండగా తాము రూ. 2400 ఎలా ఇవ్వాలని ప్రశ్నించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉప సంహరించుకోకపోతే తమ బంద్‌ను నిరవధికంగా కొనసాగిస్తామని హెచ్చరించారు. నగర  రైస్ మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షుడు రమేష్‌గౌడ మాట్లాడుతూ బళ్లారి నగరం, జిల్లాలో దాదాపు 250 రైస్ మిల్లులు ఉన్నాయని, జిల్లాలో విస్తారంగా వరి సాగు చేస్తున్నందున రైస్‌మిల్లులు బంద్ చేయడం వల్ల తమతోపాటు రైతులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.

ప్రస్తుతం రైతుల నుంచి క్వింటాల్‌కు రూ.1600తో వరి కొనుగోలు చేసి ప్రభుత్వానికి క్వింటాల్‌కు రూ. 2400కు లెవీ రూపంలో ఇవ్వాలనడం సరైన నిర్ణయం కాదన్నారు. ప్రస్తుతం అన్నభాగ్య పథకం కోసం తక్కువ ధరకే బియ్యం సేకరించాలని అనుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. వెంటనే ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉప సంహరించుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా రైస్ మిల్లర్ల అసోసియేషన్ నాయకులు నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు.

 

మరిన్ని వార్తలు