అమ్మ టీం రెడీ!

22 May, 2016 05:20 IST|Sakshi
అమ్మ టీం రెడీ!

ప్రభుత్వ ఏర్పాటుకు జయకు గవర్నర్ రోశయ్య ఆహ్వానం
అమ్మ కేబినెట్‌లో 28 మందికి చోటు
23న ప్రమాణ స్వీకారం

 
సాక్షి ప్రతినిధి, చెన్నై: అసెంబ్లీ ఎన్నికల్లో 134 స్థానాల్లో గెలుపొందడం ద్వారా ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన బలాన్ని అన్నాడీఎంకే పొందింది. చెన్నై ఆర్కేనగర్ నియోజకవర్గం నుంచి ఎన్నికైన పార్టీ ప్రధాన కార్యదర్శి జయలలితను శుక్రవారం నాటి సమావేశంలో శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా శనివారం సాయంత్రం జయలలిత రాజ్‌భవన్‌కు వచ్చి గవర్నర్ కే రోశయ్యను కలిశారు.

రోశయ్యకు జయలలిత ముందుగా పుష్పగుచ్ఛం, శాలువా ఇచ్చి మర్యాద చేయగా, రోశయ్య సైతంజయలలితకు పుష్పగుచ్ఛం అందజేశారు. ఆ తరువాత రోశయ్య సతీమణి కే శివలక్ష్మి, ఇతర కుటుంబ సభ్యులు జయలలితకు పుష్పగుచ్ఛాలు అందజేశారు. అన్నాడీఎంకే శాసనసభా పక్ష నేతగా ఎన్నికైన తీర్మాన ప్రతిని జయలలిత గవర్నర్ రోశయ్యకు అందజేశారు. తీర్మాన ప్రతిని స్వీకరించిన రోశయ్య ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా జయలలితను ఆహ్వానించారు.

ఈ సందర్భంగా 28 మంది మంత్రుల పేర్లతో కూడిన జాబితాను జయలలిత గవర్నర్‌కు అందజేశారు. ప్రొటెం స్పీకర్‌గా మేట్టూరు ఎమ్మెల్యే ఎస్ సెమ్మలై నియమితులుకాగా ఈనెల 23వ తేదీ మధ్యాహ్నం 1.30 గంటలకు గవర్నర్ కే రోశయ్య ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారు.
 
ముస్తాబవుతున్న వేదిక ప్రాంగణం:
అన్నా యూనివర్సిటీ సెంటినరీ ఆడిటోరియంలో ఈనెల 23వ తేదీన జయలలిత ఆరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆమెతోపాటు మరో 28 మంది మంత్రులుగా ప్రమాణం చేస్తారు. గవర్నర్ కే రోశయ్య వారిచేత ప్రమాణం చేయించనున్నారు. ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా ఆడిటోరియంను పోలీసులు తమ స్వాధీనంలోకి తెచ్చుకున్నారు.

ఆడిటోరియంలోపల, బైట ముస్తాబు చేస్తున్నారు. కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోదీ, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు హాజరయ్యే అవకాశం ఉంది. దీంతో పోలీస్‌శాఖ గట్టిబందోబస్తు చర్యలు చేపట్టింది. భద్రతా చర్యల్లో భాగంగా డాగ్‌స్క్వాడ్ రంగంలోకి దిగింది. ఆడిటోరియం పరిసరాల్లో అణువణువును తనిఖీ చేస్తున్నారు. జయ పదవీ ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని ప్రజలు వీక్షించేందుకు వీలుగా అన్ని జిల్లాల్లో భారీ తెరలను ఏర్పాటు చేస్తున్నారు.
 
అమ్మ కేబినెట్:
1. జే జయలలిత- ముఖ్యమంత్రి.
శాఖలు: హోం, పబ్లిక్, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్, డీఆర్వోలు ప్రజాపరిపాలన

2. ఓ పన్నీర్‌సెల్వం- ఆర్థికమంత్రి
3. దిండుగల్లు సీ శ్రీనివాసన్, అటవీశాఖ
4. ఎడపాడి కే పళనిస్వామి, ప్రజా పనుల శాఖ
5. సెల్లూరు కే రాజు, సహాకార, కార్మికశాఖ
6. పి. తంగమణి, విద్యుత్, ఎక్సైజ్
7. ఎస్‌పీ. వేలుమణి, పురపాలక పరిపాలన, గ్రామీణాభివృద్ధి
8. డి.జయకుమార్, మత్స్యశాఖ
9. సీవీ. షణ్ముగం, న్యాయశాఖ, కోర్టులు,
 జైళ్ల మంత్రి
10. కేపీ అన్బళగన్, ఉన్నతవిద్యాశాఖ
11. డాక్టర్ వీ సరోజ, సాంఘిక సంక్షేమం
12. కేసీ. కరుప్పన్నన్, పర్యావరణం
13. ఎంసీ సంపత్, పరిశ్రమలు
14. ఆర్ కామరాజ్, ఆహారం, పౌరసరఫరాలు
15. ఓ ఎస్. మణియన్, చేనేత
16. ఉడుమలై రాధాకృష్ణన్, గృహ, పట్టణాభివృద్ధి
17. డాక్టర్ సి. విజయభాస్కర్,  ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం
18. ఎస్‌పీ షణ్ముగనాథన్, పాడిపరిశ్రమ
19. ఆర్ దురైకన్ను, వ్యవసాయం, పశుసంవర్థకం
20. కాదంబూరు రాజు, సమాచారం, ప్రచారం
21. ఆర్‌బీ ఉదయకుమార్, రెవెన్యూ
22. కేటీ రాజేంద్రబాలాజీ, గ్రామీణ పరిశ్రమలు
23. కేసీ వీరమణి, వాణిజ్యపన్నులు
24. పి.బెంజిమిన్, పాఠశాల విద్య, క్రీడ, యువజన సంక్షేమం
25. వెల్లమండి ఎన్.నటరాజన్, పర్యాటకం
26. ఎస్ వలర్మ29. ఎంఆర్ విజయభాస్కర్, రవాణాశాఖ

>
మరిన్ని వార్తలు