తిరుమల: కర్ణాటక గవర్నర్ వాజుభాయ్ వాలా శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆయన ఉదయం నైవేద్య విరామ సమయం అనంతరం ఆలయానికి వచ్చారు. ముందుగా ధ్వజస్తంభానికి మొక్కుకున్నారు. అనంతరం స్వామిని, ఆ తర్వాత వకుళమాతను దర్శించి హుండీలో కానుకలు సమర్పించుకున్నారు. ఈ సందర్భంగా రంగనాయక మండపంలో గవర్నర్కు వేదపండితులు ఆశీర్వచనం చేయగా, ఆలయ అధికారులు లడ్డూప్రసాదాలు అందజేశారు. అలాగే ఏపీ శాసనమండలి చైర్మన్ చక్రపాణి కూడా శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఏడుకొండలవాడిని దర్శించుకోవటం చాలా ఆనందంగా ఉందని, విశ్వశాంతి కోసం ప్రార్థించానని, స్వామివారిని ఎన్నిసార్లు దర్శించినా ఇంకా చూడాలనే తపన ఉంటుందని చెప్పారు. తెలుగు గడ్డపై తిరుమల శ్రీవారి ఆలయం ఉండటం ప్రతి ఒక్క తెలుగువారి అదృష్టమని అన్నారు.