1,300 కేసులు నమోదు

1 Jan, 2018 16:05 IST|Sakshi
బెంగుళూరు నగర కమిషనర్‌ సునీల్‌ కుమార్‌

సాక్షి, బెంగళూరు : దేశ ఐటీ రాజధాని బెంగళూరులో నూతన సంవత్సర వేడుకల్లో మళ్లీ కీచక పర్వం చోటు చేసుకున్నట్టు వచ్చిన వార్తలను నగర పోలీస్‌ కమిషనర్‌ ఖండించారు. అమ్మాయిలను వేధించిన ఘటనలేవీ న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్‌లో జరగలేదని చెప్పారు. గతేడాది కీచక పర్వం చోటు చేసుకున్న ప్రాంతంలో ఓ యువతి ఏడుస్తూ వెళ్లడం అనుమానాలకు తావిచ్చింది.

దీనిపై వివరణ ఇచ్చిన కమిషనర్ సునీల్‌ కుమార్‌‌.. సీసీటీవీ ఫుటేజిలో వేధింపులకు సంబంధించిన దృశ్యాలు ఏవీ లభ్యం కాలేదని చెప్పారు. నిరుడు నగరంలోని బిగ్రేడ్‌, ఎంజీ రోడ్‌ ప్రాంతాల్లో యువతులపై అల్లరిమూకలు సామూహిక వేధింపులకు పాల్పడినట్టు వెల్లడికావడంతో దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమైన విషయం తెలిసిందే.

రక్షణ కల్పించడంలో విఫలమైన ప్రభుత్వంపై ప్రజలు, విపక్షాలు దుమ్మెత్తిపోశాయి. ఈ నేపథ్యంలో 2018 నూతన సంవత్సర వేడుకలకు కర్ణాటక ప్రభుత్వం భారీ స్థాయిలో భద్రత ఏర్పాట్లు చేసింది. గతేడాది చేదు అనుభవాలను దృష్టిలో ఉంచుకుని బిగ్రేడ్‌, ఎంజీ రోడ్డు, చర్చి స్ట్రీట్‌లలో పెద్ద ఎత్తున పోలీసులను మొహరించింది. ఎక్కడికక్కడ సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసింది. డ్రోన్‌ కెమెరాలు, మఫ్టీ పోలీసులతోనూ నిఘా పెట్టింది.

అయితే, ఈ సారి న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్‌లో మొత్తం 1300ల ట్రాఫిక్‌ నిబంధనల ఉల్లంఘన కేసులో నమోదయ్యాయి. వేడుకల్లో శ్రుతిమించితే కఠిన దండన తప్పదని ముందే పోలీసులు హెచ్చిరించినా బెంగళూరు వాసులు వెనక్కు తగ్గలేదు. కొత్త ఉత్సాహంతో నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్నారు.


 

మరిన్ని వార్తలు