పోలింగ్‌కు 48 గంటల ముందు రాజకీయ ఎస్‌ఎంఎస్‌లు బంద్ ఎన్నికల కమిషన్

9 Nov, 2013 00:29 IST|Sakshi

 న్యూఢిల్లీ : ఎన్నికల సమయంలో ఓటర్లను ఆకట్టుకునేవిధంగా రాజకీయ నాయకులు పంపే సామూహిక ఎస్‌ఎంఎస్‌లను ఎన్నికల తేదీకి 48 గంటల ముందు నుంచి నిలిపివేయాలని మొబైల్ సర్వీస్ కంపెనీలకు ఎలక్షన్ కమిషన్ శుక్రవారం ఆదేశించింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళికి వ్యతిరేకంగా ఓటర్లను వివిధ పార్టీలు ఎస్‌ఎంఎస్‌ల ద్వారా ప్రలోభపెట్టకుండా ఈసీ దృష్టి సారించనుంది.  ఒకవేళ ఏ పార్టీలేదా పార్టీ అభ్యర్థి సామూహిక ఎస్‌ఎంఎస్‌ల కోసం సంప్రదిస్తే వారి వివరాలను తమకు అందించాలని మొబైల్ ఆపరేటర్లకు ఈసీ ఆదేశించింది. ఈ విషయమై శుక్రవారం అన్ని మొబైల్ ఆపరేటర్లతో ఈసీ సమావేశం నిర్వహిం చింది. ఈ సందర్భంగా ఢిల్లీ ముఖ్య ఎన్నికల అధికారి విజయ్‌దేవ్ మాట్లాడుతూ పోలింగ్‌కు ముందు 48 గంటలలోపు రాజకీయపార్టీలు ఓటర్లకు సామూహిక ఎస్‌ఎంఎస్‌లను పంపాలని కోరితే నిరాకరించాలని మొబైల్ సర్వీస్ ఆపరేటర్లకు సూచించామన్నారు.
 
  ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించకుండా చూడాల్సిన బాధ్యత అధికారుల ఉందని ప్రత్యేక ముఖ్య ఎన్నికల అధికారి షుర్‌బిర్ సింగ్ తెలిపారు. అలాగే సరైన పరిశీలన లేకుండా ఎవరికీ సిమ్‌కార్డులను జారీ చేయొద్దని మొబైల్ సర్వీస్ ప్రతినిధులను కోరామన్నారు. ఎన్నికల ముందు సిమ్‌కార్డుల కొనుగోళ్లు గణనీయంగా పెరి గినట్లు తమ దృష్టికి వచ్చిందని, నకిలీ ధ్రువీకరణ పత్రాలతో సిమ్‌కార్డులు తీసుకునేవారు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే అవకాశాలుంటాయని ఆయన విశ్లేషించారు. దీన్ని నివారించేందుకు ముందే యాక్టివేట్ చేసిన సిమ్‌కార్డుల అమ్మకాలను నిలిపివేయాలని చెప్పారు. సిమ్‌కార్డులతో ఎటువంటి సమస్య ఎదురైనా డీలరుపైనే కాకుండా సదరు కంపెనీపైనా కూడా చర్యలు తీసుకుంటామని ఈసీ అధికారులు హెచ్చరించారు

మరిన్ని వార్తలు