అది విద్వేష ప్రసంగమే.. ప్రధానిపై చర్య తీసుకోండి: కాంగ్రెస్‌

17 Nov, 2023 05:51 IST|Sakshi

న్యూఢిల్లీ: రాజస్తాన్‌లోని బర్మేర్‌లో బుధవారం ఎన్నికల ప్రచారంలో విద్వేష పూరిత ప్రసంగం చేసిన ప్రధాని మోదీపై చర్య తీసుకోవాలని కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల సంఘం(ఈసీ)ని కోరింది. కాంగ్రెస్‌కు మరణ శాసనం లిఖించేందుకు కమలం బటన్‌పై నొక్కాలంటూ ఓటర్లకు పిలుపునిచ్చారని కాంగ్రెస్‌ నేత జైరాం రమేశ్‌ తెలిపారు. ప్రధాని అహంకారానికి ప్రజలు తగు గుణపాఠం చెబుతారన్నారు.

‘కాంగ్రెస్‌ నేతలను మోదీ ఎంతగా ద్వేషిస్తున్నారో ఆయన ప్రసంగాన్ని చూస్తేనే తెలుస్తుంది. ప్రధానమంత్రి వంటి బాధ్యతాయుత పదవిలో ఉన్న వ్యక్తి ఇటువంటివి మాట్లాడొచ్చా? ఆయన ప్రజాస్వామ్యం గొంతు పిసికేస్తున్నారు. ఇది కచ్చితంగా విద్వేష ప్రసంగమే’అని జైరాం రమేశ్‌ గురువారం ‘ఎక్స్‌’లో పేర్కొన్నారు. ప్రధానిపై  కఠినమైన చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. బీజేపీ ఎన్నికల గుర్తు కమలం అన్న విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు