రజనీతో ఇద్దరి రొమాన్స్

22 Oct, 2015 08:14 IST|Sakshi
రజనీతో ఇద్దరి రొమాన్స్

ప్రముఖ హీరోల సరసన ఒకరికి మించి హీరోయిన్లు నటిం చడం సర్వసాధారణమైపోయింది. కమలహాసన్, విజయ్, సూర్య, అజిత్ ఇలా ప్రముఖ నటులందరూ ఇద్దరు హీరోయిన్లతో అధికంగా నటిస్తున్నారు. అలాంటి సూపర్‌స్టార్ రజనీకాంత్ మాత్రం ఇద్దరు హీరోయిన్లతో రొమాన్స్ చేసి చాలా కాలమే అయింది. అలాంటి ఈ సారి ఇద్దరు ముద్దుగుమ్మలతో సయ్యాటలాడటానికి రెడీ అవుతున్నారన్నది తాజా సమాచారం. రజనీకాంత్ ప్రస్తుతం కబాలీ చిత్రంలో నటిస్తున్నారు.
 
  రాధిక ఆప్టే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని వి.క్రియేషన్స్ పతాకంపై కలైపులి ఎస్.థాను భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. మెడ్రాస్ చిత్రం ఫేమ్ రంజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటోంది. రజనీకాంత్ తదుపరి చిత్ర ప్రీ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు మొదలయ్యాయి. ఈ  చిత్రం గురించి గుర్తు చేయాల్సిన అవసరం లేదు. కారణం ఆరంభానికి ముందే చాలా విశేషాలు ఈ చిత్రం గురించి అనధికారికంగా హోరెత్తుతున్నాయి. రజనీకాంత్, శంకర్‌ల కలయికలో రెండు సంచలన చిత్రాల తరువాత ముచ్చటగా తెరకెక్కనున్న మూడో చిత్రం ఎందిరన్-2. ఎందిరన్ చిత్రం ఎంత వండర్ కలిగించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దానికి సీక్వెల్‌గా రూపొందనున్న క్రేజీ చిత్రమే ఎందిరన్-2.
 
  ఇందులో రజనీకాంంత్‌కు విలన్‌గా విక్రమ్ నటించనున్నారనే ప్రచారం ఇంతకు ముందు జరిగింది. అయితే తాజాగా హాలీవుడ్ సూపర్‌స్టార్ ఆర్నాల్డ్ విలన్‌గా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్నది కోలీవుడ్ టాక్. ఇందులో హీరోయిన్‌గా నటించే అదృష్టం ఇంగ్లీష్ బ్యూటీ ఎమీజాక్సన్‌ను వరించిందనే ప్రచారం జరుగుతోంది. ఇందులో మరో ముద్దుగుమ్మ కూడా నటించనున్నారట. ఆమె కోసం శంకర్ బాలీవుడ్, కోలీవుడ్‌లలో జల్లెడేసి వడగడుతున్నారని తెలిసింది. లైకా సంస్థ నిర్మించనున్న ఈ చిత్రం షూటింగ్‌కు డిసెంబర్ 25న ముహూర్తం పెట్టినట్లు తెలిసింది.
 

మరిన్ని వార్తలు