తెలుగు కళాశాల ఆవరణలో దుర్గంధం

28 Nov, 2014 22:35 IST|Sakshi

భివండీ, న్యూస్‌లైన్: భివండీ పట్టణంలోని పేనాగావ్ ప్రాంతంలో గల తెలుగు సమాజ్ శిక్షణ్ సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న కళాశాల పరిసర ప్రాంతంలో చెత్తాచెదారంతోపాటు జంతు వ్యర్థాలను పారబోస్తుండటంతో దుర్గంధం వ్యాప్తిస్తోంది. ఈ విషయమై భివండీ కార్పొరేషన్ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదుచేసినా పట్టించుకోవడం లేదని కళాశాల యాజమాన్యం ఆరోపిస్తోంది. చెత్తతోపాటు జంతు కళేబరాలను, వ్యర్థాలను ఇక్కడ పారవేస్తుండటంతో కుక్కలు, పందుల సంచారం ఎక్కువగా ఉంటోంది. అలాగే కళాశాలకు వచ్చే విద్యార్థులు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు.

ఈ సందర్భంగా పద్మశాలి ఇంగ్లిష్ మీడియం హైస్కూల్ అండ్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ సూర్యశేఖర్ చిటిమల్ల మాట్లాడుతూ.. ప్రతిరోజూ చుట్టుపక్కల ప్రాంతాలనుంచి చెత్తతోపాటు జంతు వ్యర్థాలను కూడా తీసుకువచ్చి ఇక్కడ పారబోస్తున్నారని ఆరోపించారు. చాలామంది మాంసం విక్రయదారులు రోడ్లపైనే దుకాణాలను నడుపుతున్నారని, వాటినుంచి వచ్చిన వ్యర్థాలను రాత్రిపూట తీసుకువచ్చి కళాశాల ఆవరణలో పారేసి పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సదరు మాంసం షాపుల యజమానులపై కార్పొరేషన్ కమిషనర్ జీవన్ సోనావునే, ఆరోగ్య విభాగ అధికారి ఎం.ఎల్. సోనావునే తక్షణమే చర్యలు చేపట్టి వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

మరిన్ని వార్తలు