తెలంగాణలో 15 మంది ఐఏఎస్‌ల బదిలీ

15 Jul, 2020 22:42 IST|Sakshi

ప్రజారోగ్య విభాగం కమిషనర్‌గా వాకాటి కరుణ 

అటవీశాఖకు శాంతికుమారి..

ఎస్సీ అభివృద్ధి శాఖ కమిషనర్‌గా యోగితా రాణా

రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ఐఏఎస్‌లకు స్థానచలనం 

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్ర వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అటవీ శాఖకు బదిలీ అయ్యా రు. ఆమె స్థానంలో ఆ శాఖ కార్యదర్శిగా సయీద్‌ అలీ ముర్తజా రిజ్వీ నియమితులయ్యారు. ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమ విభాగం కమిషనర్‌ యోగితా రాణా బదిలీ కాగా, ఆమె స్థానంలో మళ్లీ వాకాటి కరుణ నియమితులయ్యారు. ఈ మేరకు పెద్ద సంఖ్యలో ఐఏఎస్‌ అధి కారులకు స్థానచలనం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీచేశారు.

కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతున్న ప్రస్తుత తరుణంలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖలో కీలక మార్పులు చేపట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్రంలో కరోనా నిర్థారణ పరీక్షల నిర్వహణ తీరు, రోగులకు చికిత్స సదుపాయాలు, ప్రైవేటు ఆస్పత్రుల ఫీజుల దోపిడీ అంశాలపై ప్రభుత్వ వ్యవహార శైలిని తప్పుబడుతూ రాష్ట్ర హైకోర్టు గత కొన్ని రోజులుగా తీవ్ర వ్యాఖ్యలు చేస్తోంది. హైకోర్టులో ప్రభుత్వ వాదనను సరిగా వినిపించలేకపోయారనే కారణంతో  వైద్యారోగ్య శాఖలో కీలక మార్పులు చేసినట్టు చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌ ఓఎస్డీగా పని చేస్తున్న రిజ్వీ కొద్దికాలం కిందటి వరకు కేంద్ర ప్రభుత్వంలో డిప్యూటేషన్‌పై కీలక పదవిలో పనిచేశారు.

తెలంగాణ వచ్చిన కొత్తలో తెలంగాణ ట్రాన్స్‌కో సీఎండీగా, ఉమ్మడి రాష్ట్రంలో హైదాబాద్, నల్లగొండ జిల్లాల కలెక్టర్‌గా వ్యవహరించారు. ముక్కుసూటి వ్యవహారశైలి, దూకుడు పనితీరు కారణంతోనే ప్రస్తుత సంక్షోభ సమయంలో రిజ్వీని రాష్ట్ర ప్రభుత్వం వైద్యారోగ్య శాఖ కార్యదర్శిగా నియమించినట్టు చర్చ జరుగుతోంది. వాకాటి కరుణ గతంలో సైతం ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమ విభాగం కమిషనర్‌గా పనిచేశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పన, కేసీఆర్‌ కిట్స్‌ వంటి కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించారు. ఈ క్రమంలో ఆమెను భూ రికార్డుల ప్రక్షాళన కోసం ప్రభుత్వం మూడేళ్ల క్రితం మిషన్‌ డైరెక్టర్‌గా నియమించింది. ప్రస్తుతం నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో మళ్లీ ఆమె సేవలను ప్రజారోగ్య విభాగానికి అవసరమని భావించి తిరిగి పాత పోస్టుకు రప్పించింది. 

►అడిషనల్ సీఈవో - జ్యోతి బుద్ధప్రకాష్‌
►వైద్య ఆరోగ్యశాఖ, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి - సయ్యద్‌ అలీ ముర్తుజా రజీ
►అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి-  శాంతికుమారి
►ఈపీటీఆర్‌ఐ డైరెక్టర్ జనరల్‌- అదర్‌ సిన్హా
►నాగర్‌కర్నూల్‌ కలెక్టర్- ఎల్‌ శర్మన్‌ 
►పాఠశాల విద్యా డైరెక్టర్‌- శ్రీదేవసేన 
►హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ కమిషనర్‌- వాకాటి కరుణ
►పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి- కేఎస్‌ శ్రీనివాసరాజు
►సాంఘిక సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి- విజయ్‌కుమార్‌
►సాంఘిక సంక్షేమ శాఖ కమిషనర్‌- యోగితా రాణా
►సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శిగా రాహుల్‌ బొజ్జా కొనసాగింపు 
►ఆదిలాబాద్‌ కలెక్టర్‌- సిక్తా పట్నాయక్‌ 
►పెద్దపల్లి ఇంచార్జ్‌ కలెక్టర్- భారతీ హోలీకేరి
►గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి- ఇ. శ్రీధర్‌ 
►ప్రత్యేక ప్రధాన కార్యదర్శి- రాణి కుముదిని దేవి
►తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు.. పర్యావరణ శాస్త్ర సాంకేతిక అదనపు బాధ్యతలు రజత్‌కుమార్‌కు అప్పగింత

మరిన్ని వార్తలు