ఐఐటీ హైదరాబాద్‌లో బీటెక్‌ ఏఐ 

18 Jan, 2019 00:40 IST|Sakshi

దేశంలో తొలి, ప్రపంచంలో మూడో ఇన్‌స్టిట్యూట్‌గా ఘనత

సాక్షి, హైదరాబాద్‌: ఇంజనీరింగ్‌ విద్యలో కృత్రిమ మేధస్సు(ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌) ను ప్రత్యేక బ్రాంచ్‌గా బీటెక్‌ ప్రోగ్రామ్‌ను ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ హైదరాబాద్‌(ఐఐటీహెచ్‌) ప్రారంభించింది. దేశంలో కృత్రిమ మేధస్సును బ్రాంచ్‌గా నాలుగేళ్ల బీటెక్‌ ప్రోగ్రామ్‌ను అందించనున్న తొలి ఇన్‌స్టిట్యూట్‌ గా ఘనతకెక్కింది. అంతర్జాతీయంగా మూడో ఇన్‌స్టిట్యూట్‌గా నిలిచింది. ప్రస్తుతం బీటెక్‌ (ఏఐ) కోర్సును ఎంఐటీ (యూఎస్‌), కార్నెగీ మిలన్‌ వర్సిటీ(యూఎస్‌)లే అందిస్తున్నాయి. 2019–20 విద్యాసంవత్సరం నుంచి ఐఐటీ హెచ్‌లో ఏఐ అందుబాటులోకి రానుంది. తొలి బ్యాచ్‌లో జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ర్యాంకు ఆధా రంగా 20 మందితో దీన్ని ప్రారంభించనున్నట్లు ఐఐటీహెచ్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ యూబీ దేశాయ్‌ తెలిపారు.

ఏఐ, మెషిన్‌ లెర్నింగ్‌ విభాగాల్లో  డిమాండ్‌కు అనుగుణంగా విద్యార్థులకు నైపుణ్యాలను అందించేలా ఏఐ బ్రాంచ్‌ కరిక్యులమ్‌ ను రూపొందించినట్లు చెప్పారు. ఏఐ ఆధారిత పరిష్కారాలు ప్రస్తుతం మన దేశంలో హెల్త్‌కేర్, పంటలు, నేల నిర్వహణ, వాతావరణ అంచనాలు, భద్రత, రక్షణ వంటి విభాగాల్లో ఉపయోగపడుతున్నాయని ఐఐటీ హెచ్‌ఆర్‌ అండ్‌ డీ డీన్, ప్రొఫెసర్‌ ఎస్‌.చన్నప్పయ్య తెలిపారు. ఇతర బ్రాంచ్‌ల్లో బీటెక్‌ చేరిన అభ్యర్థులు ఏఐను మైనర్‌ కోర్సుగా ఎంపిక చేసుకునే అవకాశం కల్పించనున్నట్లు చెప్పారు. దీంతో ఈ విభాగం లో మానవ వనరుల డిమాండ్‌–సప్లయ్‌ వ్యత్యా సం తగ్గించేలా అడుగులు వేస్తామన్నారు.   

మరిన్ని వార్తలు