రూ. 9.50 లక్షలు పలికిన బాలాపూర్ లడ్డూ

8 Sep, 2014 10:25 IST|Sakshi
రూ. 9.50 లక్షలు పలికిన బాలాపూర్ లడ్డూ

హైదరాబాద్ : ప్రపంచస్థాయి గుర్తింపు పొందిన బాలాపూర్ లడ్డూ ఈ ఏడాది రూ.9.50 లక్షలు పలికింది.  ఆది నుంచి పోటా పోటీగా సాగిన వేలం పాటలో బాలాపూర్ లంబోదరుడి లడ్డూను సింగిరెడ్డి జయేందర్ రెడ్డి సొంతం చేసుకున్నారు. రూ.116  నుంచి ప్రారంభమైన వేలం పాట ...చివర వరకూ ఉత్కంఠగా కొనసాగింది. లడ్డూను సొంతం చేసుకునేందుకు 24మంది భక్తులు పోటీ పడ్డారు. చివరకు గణేష్ లడ్డూ సింగిరెడ్డి జయేందర్ రెడ్డిని వరించింది. గత ఏడాది రూ.9.26 లక్షల పలికిన ఈ లడ్డూ ఈసారి మరో 24వేల అధికంగా పలికింది. ఈ లడ్డూను సొంతం చేసుకునేందుకు ఏటా పోటీ పెరుగుతూ వస్తోంది.

కాగా బాలాపూర్ లడ్డూ ప్రస్థానం 1980లో మొదలైంది. మూడు దశాబ్దాల సుదీర్ఘ యానంలో ఏయేటికాయేడు చరిత్రను సృష్టిస్తోంది. గణేశ్ ఉత్సవాలు ముగిసే వరకు బాలాపూర్ వాసులు మద్యం, మాంసాహారానికి దూరంగా ఉంటారు. ఇక్కడి లడ్డూను ప్రత్యేకంగా పూజిస్తారు. లడ్డూను వేలంలో దక్కించుకున్న వారే కాకుండా దాన్ని దర్శించి పూజించిన వారు సైతం సుఖ సంతోషాలతో ఉంటారన్నది ఇక్కడి వారి నమ్మకం. మొదట్లో వేలల్లో పలికిన లడ్డూ ఆ తరువాత లక్షలకు చేరటం విశేషం.

 

మరిన్ని వార్తలు