నేటి నుంచి బతుకమ్మ కానుకలు 

23 Sep, 2019 07:55 IST|Sakshi

 27 వరకు అందజేత 

ప్రారంభించనున్న మంత్రి సబిత, జెడ్పీ చైర్‌పర్సన్‌ అనితారెడ్డి  

మొయినాబాద్, కొత్తూరు గోదాంలలో స్టాక్‌ పాయింట్లు

సాక్షి,  మహేశ్వరం: మహిళలకు సోమవారం నుంచి బతుకమ్మ చీరలు పంపిణీ చేయనున్నారు. 28న వేడుకలు ప్రారంభం కానుండడంతో తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ చీరలను అందజేసేందుకు నిర్ణయించింది. ఈమేరకు గ్రామాల వారీగా జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. జిల్లాలో 18 సంవత్సరాలు నిండిన 6,65,686 మంది మహిళలను గుర్తించగా ఇప్పటికే 3,58,600 చీరలు జిల్లాకు చేరాయి. మొయినాబాద్‌ గోదాంలో 1,62,000, కందుకూరు మండలం కొత్తురులో 1,96,600 నిల్వ చేశారు. ఇంకా అవసరమైన 3,07,086 చీరలు త్వరలో వస్తాయని అధికారులు పేర్కొన్నారు. జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో బతుకమ్మ చీరలను పంపిణీ చేయనున్నారు. రంగురంగలు చీరలను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శి, వీఆర్వో, మహిళా సంఘాలు, రేష¯Œ  డీలర్లు, బిల్‌ కలెక్టర్లు, మహిళా సంఘాల ఆధ్వర్యంలో పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీకైన బతుకమ్మ వేడుకలకు ప్రజలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. మూడేళ్లగా సర్కారు బతుకమ్మ కానుకగా చీరలను పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. మండలాల వారీగా పంపిణీ చేసేందుకు అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు.

చీరల పంపిణీ ఇలా..  
సోమవారం నుంచి 27వరకు బతుకమ్మ చీరలను  పంపిణీ చేసేందుకు  అధికారులు అన్ని ఏర్పాట్లు  చేశారు. మొయినాబాద్‌ గోదాం నుంచి చేవెళ్ల, చౌదరిగూడ, శంషాబాద్, గండిపేట, శేరిలింగపల్లి, చందానగర్‌ ప్రాంతాలకు 37 డీసీఎం వాహనాల్లో చీరల తరలింపునకు అధికారులు ఏర్పాటు చేసి రూట్‌ అధికారులకు నియమించారు. ఒక డీసీఎంకు ఇద్దరు చొప్పున అధికారులకు ఇన్‌చార్జిలుగా నియమించారు. మొదట గ్రామీణ ప్రాంతంలో పంపిణీ  పూర్తయ్యాక అర్బన్‌ మండలాలపై దృష్టిసారించనున్నారు. ఐదు రోజుల్లో పంపిణీ తంతంగాన్ని పూర్తి  చేసేందుకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. మండలాల వారీగా తహసీల్దార్, పట్టణాలల్లో మున్సిపల్‌ కమిషనర్లు చీరల పంపిణీని పర్యవేక్షించనున్నారు. చీరల పంపిణీలో మంత్రి, జెడ్పీ చైర్‌పర్సన్, వైస్‌ చైర్మన్, ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొననున్నారు. 

టెప్కో నుంచి  
టెప్కో నుంచి జిల్లాకు బతుకమ్మ చీరలు వచ్చాయి. సిరిసిల్ల పవర్‌లూమ్‌ చీరలను  అందించనున్నారు. దసరా పండుగకు రెండు నెలల ముందు నుంచే బతుకమ్మ చీరల పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేశారు. సద్దుల బతుకమ్మకు జిల్లాలో చీరలను పంపిణీకి అధికారులు చర్యలు తీసుకున్నారు. జిల్లాలో మొత్తం 27 మండలాలు ఉండగా రేషన్‌కార్డులో పేరున్న ఉన్న ప్రతి మహిళన్నివ్వనున్నారు. జిల్లాలో దాదాపు 943 రేషన్‌  షాపులు ఉన్నాయి. ఇప్పటికే తహసీల్దార్లు, సివిల్‌ సప్లయ్‌ అధికారులు, వీర్వోలు  ఇతర అనుబంధ  శాఖల అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. 

బతుకమ్మ చీరలు స్టాక్‌ పాయింట్లు... 
జిల్లాలోని మొయినాబాద్‌లోని మార్కెట్‌ కమిటీ గోదాంలో, కందుకూరు మండలం కొత్తురులో ఉన్న గోదాంలో చీరలను భద్రపరిచారు. జిల్లాలో చేవెళ్ల, రాజేంద్రనగర్, ఇబ్రహీంపట్నం, షాద్‌నగర్, కందుకూరు రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. 

హాజరుకానున్న మంత్రి 
మహేశ్వరం, కందుకూరు మండలాల్లో బతుకమ్మ చీరల పంపిణీకి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి. సబితాఇంద్రారెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్‌  తీగల అనితారెడ్డి తదతరులు హాజరు కానున్నారు.  మహేశ్వరం నియోజకవర్గం కేంద్రంలో పోతర్ల బాబయ్య ఫంక్షన్‌ హాలులో సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు, కందుకూరు మండల కేంద్రంలో 2 గంటలకు బతుకమ్మ చీరలను పంపిణీని మంత్రి తదితరులు ప్రారంభించనున్నారు.

అంతా సిద్ధం చేశాం..  
జిల్లాలో 18 ఏళ్లు నిండిన ఆడబిడ్డకు చీరలు పంపిణీ చేస్తాం. మొత్తం 6,65,686 మందికి  అందజేస్తాం. ఇప్పటి వరకు జిల్లాకు 3,58,600 చీరలు వచ్చాయి. మిగతావి త్వరలో రానున్నాయి. గతంలో మాదిరిగా ఈసారి బతుకమ్మ చీరల పంపిణీని విజయవంతంగా  పూర్తి చేస్తాం. మొయినాబాద్, కందుకూరు మండలం కొత్తూరులో ఉన్న గోదాంల నుంచి చీరలను ఆయా మండలాలకు తరలిస్తాం. రేషన్‌  దుకాణాల వద్ద బతుకమ్మ చీరలను పంపిణీ చేయనున్నారు.  – ప్రశాంత్‌కుమార్, డీఆర్‌డీఏ పీడీ 

మరిన్ని వార్తలు