ఎర్రకోటను ముట్టడిస్తాం

2 May, 2015 04:10 IST|Sakshi

పార్లమెంట్‌లో బీసీ బిల్లు పెట్టాలి: జాజుల శ్రీనివాస్‌గౌడ్
సాక్షి,హైదరాబాద్: ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనైనా బీసీ బిల్లును ప్రవేశపెట్టి చట్టసభల్లో 50 శాతం రాజకీయ రిజర్వేషన్లను కల్పించకపోతే ఢిల్లీలోని ఎర్రకోటను ముట్టడిస్తామని బీసీ సంక్షేమసంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్, జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ హెచ్చరించారు. శుక్రవారం బీసీ భవన్‌లో జరిగిన సంఘం పదాధికారుల సమావేశంలో జాజుల శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ, మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 నెలలు గడచినా బీసీల సమస్యల పరిష్కారంలో ఉలుకుపలుకు లేకపోవడం బాధిస్తోందన్నారు.

పార్లమెంట్‌లో అన్ని బిల్లులను ఆమోదిస్తూ బీసీ బిల్లు విషయంలో మాత్రం అన్ని పార్టీలు ముఖం చాటేస్తున్నాయని ఆయన ధ్వజమెత్తారు. చట్టసభల్లో రిజర్వేషన్లు పెడితే తప్ప ఈ దేశంలో సామాజిక న్యాయం జరగదని, అందుకోసం బీసీలు కేంద్రంపై సమరభేరీ మోగించడానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో శారద, నీల వెంకటేశ్, కుల్కచర్ల శ్రీనివాస్, బర్క కృష్ణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు