కేసీఆర్‌కు స్పష్టమైన పాలసీ లేదు: నల్లు ఇంద్రసేనా రెడ్డి

22 Aug, 2019 14:53 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వానికి ఏ అంశంలోనూ స్పష్టమైన పాలసీ లేదని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్లు ఇంద్రసేనా రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. గురువారమిక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ పరిపాలనలో శూన్యత ఏర్పడిందన్నారు. ప్రభుత్వం దగ్గర వ్యవసాయ ప్రణాళిక లేదు.. రైతులకు భరోసా లేదని మండి పడ్డారు. ఆఖరికి మంత్రి వర్గానికి కూడా స్వేచ్ఛలేదని.. మంత్రులు తమ తమ శాఖల్లో స్వతంత్రంగా సమీక్షలు చేసే అవకాశం లేదని ఆరోపించారు. కొత్త చట్టాల పేరుతో హడావుడి చేస్తున్నారు తప్ప వాటి వల్ల ప్రయోజనం ఏం లేదన్నారు. చెక్‌పవర్‌ని పెట్టి గ్రామీణ వ్యవస్థను కుంటుపడేలా చేస్తున్నారు.. సర్పంచులకు అధికారాలే లేవని ఆరోపించారు.

రెండేళ్ల క్రితం జరిగిన కలెక్టర్ల సమావేశంలో రెవెన్యూలోకి రిజిస్ట్రేషన్‌ అని చెప్పారు ప్రస్తుతం అది ఏమైందని నల్లు ఇంద్రసేనా రెడ్డి ప్రశ్నించారు. భూ వివాదాదాలకు శాశ్వత పరిష్కారమని ఆ రోజు అదే చెప్పారు‌.. మొన్న జరిగిన కలెక్టర్ల సమావేశంలో కొత్త రెవెన్యూ చట్టం అంటూ ఈ రోజు మళ్లీ అదే చెబుతున్నారు.. పాలసీ విషయంలో ప్రభుత్వానికి స్పష్టత ఉందా అని ప్రశ్నించారు. కేసీఆర్‌ పాలనలో విద్యార్థుల అవస్థలకు లేక్కే లేదు.. నిరుద్యోగులకు ప్రభుత్వంపై నమ్మకం లేదని దుయ్యబట్టారు. కేసీఆర్‌ బాద్యత లేకుండా మాట్లాడుతున్నారని మండి పడ్డారు.

మరిన్ని వార్తలు