ఇంటర్‌ బోర్డు నిర్వాకానికి అనామిక బలి

1 Jun, 2019 18:40 IST|Sakshi

 ఇంటర్‌ బోర్డు నిర్లక్ష్యం కారణంగా విద్యార్థుల ఆత్మహత్యలు 

మొదటి ఫలితాల్లో 20 మార్కులు.. రీవెరిఫికేషన్‌లో 48 మార్కులు

ఆత్మహత్యకు పాల్పడిన ఇంటర్‌ విద్యార్థిని అనామిక

సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్‌ ఫలితాల విడుదలలో తీవ్ర తప్పిదాలు జరిగాయని రీవెరిఫికేషన్‌ ఫలితాలు వెలువడిన అనంతరం స్పష్టమవుతోంది. ఫలితాల్లో  ఇంటర్‌ బోర్డు నిర్లక్ష్యం బయటపడింది. ఏప్రిల్‌ 18న విడుదలైన తెలంగాణ ఇంటర్‌ ఫలితాల్లో మూడు లక్షల మందికి పైగా విద్యార్థులు ఫెయిల్‌ అయ్యారని ఇంటర్‌ బోర్డు ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో అనేక మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. పరీక్షలు బాగానే రాసినా.. ఫెయిల్‌ అయినామన్న బాధతో ప్రాణాలు తీసుకున్నారు. మొదట విడుదలైన ఫలితాల్లో అనామిక అనే విద్యార్థిని ఫెయిల్‌ అయినట్లు రావడంతో క్షణీకావేశంలో ఆమె ఆత్మహత్యకు పాల్పడ్డారు. తాజాగా విడుదలైన రీవెరిఫికేషన్‌ ఫలితాల్లో ఆమె పాస్‌ అయినట్లు రిజల్ట్‌ వచ్చింది. 

మొదటి ఫలితాల్లో 20 మార్కులని చెప్పగా.. రీవెరిఫికేషన్‌లో 48 మార్కులు వచ్చినట్లు బోర్డు ప్రకటించింది. దీంతో ప్రభుత్వ తప్పిదం కారణంగా తమ బిడ్డ ప్రాణాలు కోల్పోయిందని ఆమె తల్లీదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. బోర్డుపై క్రిమినల్‌ కేసు నమోదు చేయాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. దీనిపై శనివారం మక్దుంభవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో బాలల హక్కుల సంఘం అధ్యక్షుడు అచ్చుతరావు మాట్లాడుతూ.. విద్యార్థుల మరణానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు. ఇంటర్‌ బోర్డు నిర్లక్ష్యానికి ఐపీసీ సెక్షన్‌ 304 (ఏ) ప్రకారం కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. బోర్డు కార్యదర్శి అశోక్‌ కుమార్‌ను కోర్డు చెప్పక మందే అరెస్ట్‌ చేయాలని అన్నారు.

మరిన్ని వార్తలు