'కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా'

28 Jan, 2015 11:22 IST|Sakshi

హైదరాబాద్ : రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకే చెస్ట్ ఆసుపత్రిని మరో ప్రాంతానికి తరలించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని టీ ఎన్జీవో అధ్యక్షుడు దేవీ ప్రసాద్ వెల్లడించారు. బుధవారం హైదరాబాద్లో మాట్లాడుతూ.... కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. చెస్ట్ ఆసుపత్రి తరలింపుపై ఉద్యోగులు చేస్తున్న ఆందోళన వెంటనే విరమించాలని వారికి దేవీ ప్రసాద్ హితవు పలికారు.

రంగారెడ్డి జిల్లాలోని ప్రసిద్ధ అనంతగిరి క్షయ నివారణ కేంద్రం (టీబీ శానిటోరియం)ను తొలగించి.. ఆ స్థానంలో మానసిక రోగుల చికిత్సాలయం, చెస్ట్ ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర సర్కారు నిర్ణయించింది. అందుకోసం ఇప్పటికే ప్రభుత్వం రంగంలోకి దిగి సన్నాహాలు ప్రారంభించినట్లు సమాచారం. అయితే ఎర్రగడ్డలోని ఈ రెండు ఆస్పత్రుల స్థానంలో పెరేడ్ గ్రౌండ్‌కు శాశ్వత వేదికగా ఉపయోగించుకోనున్నట్లు ఇటీవల ఆయా ఆస్పత్రుల తనిఖీల్లో భాగంగా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో  చెస్ట్ ఆసుపత్రిని తొలగించడం భావ్యం కాదని ఆసుపత్రి సిబ్బంది, వైద్యులు ఆందోళనకు దిగిన విషయం విదితమే.

మరిన్ని వార్తలు