అవినీతి డబ్బుతో కేసీఆర్‌ గెలవాలనుకుంటున్నారు: సిద్ధరామయ్య

10 Nov, 2023 18:07 IST|Sakshi

సాక్షి, కామారెడ్డి: తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ధీమా వ్యక్తం చేశారు. కామారెడ్డిలో కాంగ్రెస్‌ బీసీ డిక్లరేషన్‌ సభలో పాల్గొన్న ఆయన సీఎం కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. కేసీఆర్‌ అవినీతి డబ్బుతో ప్రజలను కొనేందుకు చూస్తున్నారు. కేసీఆర్‌ను రేవంత్‌రెడ్డి ఓడించడం ఖాయం. తెలంగాణ ప్రజలు బీఆర్‌ఎస్‌ను సాగనంపాలని ఇప్పటికే నిర్ణయించుకున్నారు’’ అని సిద్ధరామయ్య పేర్కొన్నారు.

బీసీ డిక్లరేషన్‌ ప్రకటించిన కాంగ్రెస్‌
కామారెడ్డి సభలో సిద్ధరామయ్య బీసీ డిక్లరేషన్‌ ప్రకటించారు. బీసీ-డీలో ఉన్న ముదిరాజ్‌ కులస్తులను బీసీ-ఏలో చేరుస్తామని, జనాభా ప్రాతిపదికన బీసీ రిజర్వేషన్లు కల్పిస్తామని తెలిపారు. ఐదేళ్లలో బీసీల అభ్యున్నతి కోసం రూ.5 లక్షల కోట్లు ఖర్చు చేస్తాం. బీసీ సబ్‌ప్లాన్‌ ఏర్పాటు చేస్తాం. బీసీ కార్పొరేషన్‌ ద్వారా రూ.10 లక్షల ఆర్థిక సాయం. స్థానిక సంస్థల్లో 23 శాతం, రిజర్వేషన్‌ను 42 శాతం పెంచుతాం. 50 ఏళ్లు దాటిన నేత కార్మికులకు పెన్షన్‌ అందిస్తాం’’ అని సిద్ధరామయ్య వెల్లడించారు.
చదవండి: బీజేపీలో ‘బీఫామ్‌’ మంటలు.. సంగారెడ్డిలో ఉద్రిక్తత

కేసీఆర్‌కు రేవంత్‌ సవాల్‌
ఎమ్మెల్యేలు, ఎంపీల కొనుగోలుపై ఈడీ, సీబీఐ విచారణకు సిద్ధమా? అంటూ రేవంత్‌రెడ్డి..కేసీఆర్‌కు సవాల్‌ విసిరారు. కల్వకుంట్ల కుటుంబ పాలనకు చరమగీతం పాడటానికి కామారెడ్డి ప్రజలు సిద్ధం అయ్యారు. సచివాలయం ముందు లింబయ్య అనే కామారెడ్డి రైతు ట్రాన్స్ ఫార్మర్ కు ఉరేసుకొని చనిపోయారు. కేసీఆర్ కొనాపూర్ బిడ్డ అంటున్నారు.. మరి ఇక్కడి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఎందుకు ఆదుకొలేదు. కామారెడ్డి బంగారు తునక అంటున్నారు.. గజ్వేల్ నుంచి ఎందుకు వస్తున్నారు.అమ్మకు అన్నం పెట్టని వారు చిన్నమ్మకు బంగారు గాజులు అంటే నమ్మడానికి కామారెడ్డి ప్రజలు అమాయకులు కాదు’’ అంటూ రేవంత్‌ ఎద్దేవా చేశారు.

‘‘కుట్రతో కామారెడ్డి భూముల కోసం ఇక్కడికి వస్తున్నారు కేసీఆర్‌. మాస్టర్ ప్లాన్ రద్దు అంటున్నారు.. మీ ప్రభుత్వమే రద్దు అయ్యింది. మీ కుటుంబం కోసమేనా 1200 మంది ఆత్మహత్య చేసుకున్నది. కేసీఆర్‌ను ఓడించేందుకే, పార్టీ ఆదేశం మేరకే కామారెడ్డికి వచ్చాను. బూచోడు వస్తున్నాడు. మీ భూములు లాక్కుంటారు.. కామారెడ్డిలో సీఎం కేసీఆర్ కనిపించడు వినిపించడు.. కామారెడ్డి నియోజక వర్గంలో 3 లక్షల 60 వేల ఎకరాలకు వైఎస్సార్ తీసుకొచ్చిన ప్రాణహిత, చేవెళ్ల ద్వారా గోదావరి జలాలు అందాలంటే కాంగ్రెస్ గెలవాలి’’  అని  రేవంత్‌ పేర్కొన్నారు.
 

మరిన్ని వార్తలు