సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ వాసులకు ‘ఎబోలా’ ఫోబియా పట్టుకుంది. నిన్నమొన్నటి వరకు స్వైన్ఫ్లూతో బెంబేలెత్తిపోయిన సిటిజన్లు తాజాగా ఈ వైరస్ పేరు చెప్పితే చాలు ప్రజలు ఉలిక్కిపడుతున్నారు. ప్రశ్చిమాఫ్రికా దేశాల్లో ఇప్పటికే వెయ్యి మందికిపైగా ప్రాణాలను బలిగొన్న ఈ మహమ్మారి ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. ఎబోలా ప్రభావిత దేశాల్లో నగరానికి చెందిన వారు దాదాపు 25వేల మంది ఉన్నారు. అక్కడ నుంచి నగరానికి వచ్చే వారి ద్వారా వైరస్ విస్తరించే అవకాశం ఉంది.
దీంతో ఆయా దేశాల నుంచి ఇక్కడికి వచ్చే వారికి శంషాబాద్ ఎయిర్పోర్టులో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. వైరస్ లేదని నిర్థారించిన తర్వాతే వారిని బయటికి పంపుతున్నారు. ఉస్మానియా, గాంధీ వైద్యులు రౌండ్ ది క్లాక్గా పని చేస్తూ వచ్చిన వారందరినీ పరీక్ష చేస్తున్నారు. ఇప్పటి వరకు 350 మంది ప్రయాణికులకు స్క్రీనింగ్ చేసినట్లు వైద్యులు స్పష్టం చేశారు.