‘ఈఎస్‌ఐ’ వ్యవహారంపై వివరణ ఇవ్వండి

23 Jun, 2015 01:53 IST|Sakshi
‘ఈఎస్‌ఐ’ వ్యవహారంపై వివరణ ఇవ్వండి

* సాక్షి కథనంపై స్పందించిన హెచ్‌ఆర్‌సీ
* సుమోటోగా కేసు నమోదు

సాక్షి, హైదరాబాద్: ఈఎస్‌ఐ ఆస్పత్రుల్లో వైద్యం అందక రోగులు పడుతున్న నరకయాతనపై సోమవారం ‘సాక్షి’లో ప్రచురితమైన ‘ఈఎస్‌ఐ రోగుల నరకయాతన’పై మానవహక్కుల కమిషన్ స్పందిం చింది. ఈ మేరకు మానవహక్కుల కమిషన్ ఇన్‌చార్జి చైర్మన్ పెదపేరిరెడ్డి సుమోటోగా స్వీకరించి కేసు నమోదు చేశారు.

రీయింబర్స్‌మెంట్, మందుల సరఫరాదారుల అక్రమాలపై ఆగస్టు 19లోగా వివరణ ఇవ్వాలని ఈఎస్‌ఐ డెరైక్టర్, ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులకు ఆదేశాలు జారీచేశారు. కాగా, ఈ వ్యవహారంపై ఈఎస్‌ఐ డెరైక్టర్ కె.మల్లేశ్వరరావు వివరణ ఇచ్చారు. ఈఎస్‌ఐ రోగులకు వైద్యబిల్లులు చెల్లించే విధానం మారినందు వల్ల చెల్లింపుల్లో జాప్యం జరిగిందని, జూలై 1 నుంచి క్రమం తప్పకుండా చెల్లింపులు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు.

గతంలో రోగుల వైద్య బిల్లులు ఈఎస్‌ఐ కార్పొరేషన్ చెల్లించేదని, 2015 ఏప్రిల్ 1 నుంచి కేంద్ర పరిధిలో ఉండే ఈఎస్‌ఐ కార్పొరేషన్, రాష్ట్ర పరిధిలో ఉండే డెరైక్టరేట్లకు బదిలీ అయిందని చెప్పారు. ఈ నిధులను సాధారణ ఖాతాల్లోకి మార్చి, చెల్లింపులు జరిపేందుకు కొద్దిగా సమయం పట్టిందని పేర్కొన్నారు. అయితే 2015 ఏప్రిల్ 1 నుంచి సమస్య ఉందని డెరైక్టర్ చెబుతుండగా.. గతేడాది జూలై, ఆగస్టు బిల్లులు కూడా ఇప్పటి వరకు చెల్లింపులు జరగకపోవడం గమనార్హం.

మరిన్ని వార్తలు