కొడుకు చేతిలో తండ్రి హతం
సంగినేనిపల్లిలో ఘటన
వీపనగండ్ల : ఫోన్లో ఉపయోగించే మెమోరీకార్డు కోసం తండ్రికొడుకుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇది చిలికిచిలికి గాలివానగా మారింది. ఇంతలో కొడుకు చేతిలో తండ్రి ప్రాణాలు వదలిలాడు. ఈ విషాదకర సంఘటన సోమవారం రాత్రి మండలంలోని సంగినేనిపల్లిలో జరిగింది. స్థానికులు, బాధితుల కథనం మేరకు.. గ్రామానికిచెందిన గోవుల హన్మంతు అలియాస్ ఆంజనేయులు(45)కు ఇద్దరు కొడుకులు ఉండగా, చిన్నకొడుకు హైదరాబాద్కు వలసవెళ్లాడు.
ఇంటివద్దే వ్యవసాయ పనులు చేసుకుంటున్న పెద్దకుమారుడు గోవులరాజు ఫోన్లోని మెమోరీకార్డును తండ్రి తీసుకొని ఇవ్వకపోవడంతో సాయంత్రం ఇద్దరు గొడవపడ్డారు. రాత్రి 10గంటల ప్రాంతంలో ఇంటిముందు నిద్రిస్తున్న తండ్రి తలపై బండరాయితో బలంగా మోదాడు. అంతకుముందు తల్లి తలపై కర్రతో బలంగా కొట్టడంతో ప్రాణభయంతో ఆమె ఇంటివెనుక ఉన్న తన తల్లిగారింటికి పరుగులు తీసింది. కుటుంబసభ్యులను పిలుచుకుని వచ్చేలోపే తండ్రిని కిరాతకంగా హతమార్చాడు.
ఎస్ఐ జి.రవిబాబు, ఏఎస్ఐ వహిద్అలిబేగ్ గ్రామాన్ని సందర్శించి సంఘటనకు దారితీసిన కారణాలను ఆరాతీశారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కొల్లాపూర్ సీఐ రాఘవరావు గ్రామాన్ని సందర్శించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసునమోదుచేశారు.