TSPSC: జనార్ధన్‌ రెడ్డి రాజీనామా.. మళ్లీ ట్విస్ట్‌ ఇచ్చిన తమిళిసై

12 Dec, 2023 11:55 IST|Sakshi

సాక్షి,హైదరాబాద్‌: తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(TSPSC)పై కాసేపట్లో సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష జరపనుండగా గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. TSPSC చైర్మన్‌ బి. జనార్ధన్‌రెడ్డి చేసిన రాజీనామాను గవర్నర్‌ ఆమోదించలేదు. ఈ విషయాన్ని రాజ్‌భవన్‌ వర్గాలు మంగళవారం వెల్లడించాయి. ఇప్పటికే జనార్ధన్‌రెడ్డి రాజీనామాను గవర్నర్‌ ఆమోదించారని ప్రచారం జరిగిన విషయం తెలిసిందే.

అయితే గవర్నర్‌ రాజీనామా తిరస్కరించడంతో  సీఎం జరిపే సమీక్షకు జనార్ధన్‌రెడ్డి హాజరవుతారా లేదా అనేది ఉత్కంఠగా మారింది. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు, రాతపరీక్షలు, ప్రశ్నపత్రాల లీకేజీ, తదుపరి నియామక ప్రక్రియను సీఎం రేవంత్‌రెడ్డి కాసేపట్లో సచివాలయంలో సమీక్షించనున్నారు. గ్రూప్‌-2 పోటీ పరీక్షలు, గ్రూప్‌-1 ప్రశ్నపత్రం లీకేజీ,గ్రూప్‌‌-3 షెడ్యూలు ఖరారు, ఇప్పటికే నిర్వహించిన రాతపరీక్షలపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి.

కాగా, జనార్దన్‌రెడ్డి సోమవారం సాయంత్రం సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. అక్కడి నుంచి నేరుగా రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌కు రాజీనామా లేఖను అందజేశారు. 

ఇదీచదవండి..ఫైల్స్‌ చోరీ కేసు.. హైకోర్టును ఆశ్రయించిన తలసాని ఓఎస్డీ

>
మరిన్ని వార్తలు