వెలివాడలో దీక్ష విరమించండి

3 Nov, 2017 02:07 IST|Sakshi

విద్యార్థులకు హెచ్‌సీయూ షోకాజ్‌ నోటీసులు

సెంట్రల్‌ వర్సిటీలో కొనసాగుతున్న ఆందోళన

మూడో రోజుకు చేరిన నిరాహార దీక్షలు

జైలుకెళ్లడానికైనా సిద్ధమంటోన్న విద్యార్థులు

సాక్షి, హైదరాబాద్‌: విద్యార్థుల పట్ల హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) యాజమాన్యం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా విద్యార్థులు చేపట్టిన ఆందోళన తీవ్రతరమవుతోంది. విద్యార్థి సంఘం ఎన్నికల్లో 264 ఓట్ల మెజారిటీతో వైస్‌ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన ఆదివాసీ విద్యార్థి లునావత్‌ నరేష్‌ గెలుపుని ఖరారు చేయకుండా యాజమాన్యం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందంటూ ట్రైబల్‌ స్టూడెంట్స్‌ ఫెడరేషన్‌ ప్రారంభించిన నిరాహార దీక్ష మూడో రోజుకు చేరింది. నరేష్‌కు హాజరు తక్కువగా ఉందన్న సాకుతో గెలుపుని ప్రకటించకపోవడంపై కొద్దిరోజులుగా విద్యార్థులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో వెలివాడలో దీక్షా శిబిరాన్ని ఎత్తివేయాలని, లేదంటే లీగల్‌ యాక్షన్‌ తీసుకుంటామని కొందరు విద్యార్థులకు యాజమాన్యం షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. దీంతో విద్యార్థి సంఘాలు బుధవారం రాత్రి సమావేశమయ్యాయి. నరేష్‌ని వైస్‌ ప్రెసిడెంట్‌గా ప్రకటించే వరకు పోరాటాన్ని కొనసాగించాలని, నిరాహార దీక్షల్లో అన్ని విద్యార్థి సంఘాలు భాగస్వా ములు కావాలని సమావేశంలో నిర్ణయిం చారు. అరెస్టులకైనా సిద్ధమేనని, యాజ మాన్యం బెదిరింపులకు లొంగేది లేదని దీక్షలో పాల్గొన్న విద్యార్థులు స్పష్టం చేశారు. ఒకదానికొకటి సంబంధం లేకుండా డిపార్ట్‌మెంట్లే 3 రకాలైన రిపోర్టు లిచ్చి ఫలితాలను తారుమారు చేయాలని చూస్తున్నాయని విద్యార్థి సంఘాల నాయకు లు ఆరోపించారు. 3వ రోజు దీక్షలో లునావత్‌ నరేష్‌తో పాటు విద్యార్థులు సుందర్‌ రాథోడ్, వెంకటేశ్‌చౌహాన్, మున్నా సన్నంకి, అమ్ము జోసెఫ్, సురేష్‌ రాథోడ్‌ పాల్గొన్నారు.

సమస్య పరిష్కారానికి కృషి..
స్టూడెంట్స్‌ వెల్ఫేర్‌ డీన్‌ దెబాషి ఆచార్య దీక్షా శిబిరాన్ని సందర్శించి విద్యార్థులు దీక్షను విరమించాలని కోరారు. సమస్య పరిష్కారానికి కృషి జరుగుతోందని, అయితే కొంత ఆలస్యమవుతుందని, కనుక దీక్షను విరమించాలని ఆయన విద్యార్థులకు సూచించారు. అయితే నరేష్‌ని వైస్‌ ప్రెసిడెంట్‌గా ప్రకటించేంత వరకు దీక్షను విరమించేది లేదని విద్యార్థులు ఆయనకు స్పష్టంచేశారు.

షోకాజ్‌ నోటీసులు అప్రజాస్వామికం
వెలివాడలో దీక్షా శిబిరాన్ని తొలగించాల ని విద్యార్థులకు ఇచ్చిన షోకాజ్‌ నోటీసులు అప్రజాస్వామికం. భావప్రక టనా స్వేచ్ఛకు, నిరసన హక్కుకు ఇది వ్యతిరేకం. వివక్షకి ముగింపు పలికే వరకు ఉద్యమం కొనసాగిస్తాం. – వెంకటేశ్‌ చౌహాన్, ట్రైబల్‌ స్టూడెంట్స్‌ ఫెడరేషన్‌ నేత

ఆమరణ దీక్షకైనా సిద్ధం..
ప్రస్తుతం నిరవధిక దీక్షను కొనసాగిస్తు న్నాం. బుధవారం రాత్రి జరిగిన ఆల్‌ స్టూడెంట్‌ యూనియన్స్‌ సమావేశం ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని నిర్ణయించింది. అన్ని విద్యార్థి సంఘాలు దశలవారీగా దీక్షలో పాల్గొంటాయి. సమస్య పరిష్కారం కాకపోతే ఆమరణ దీక్షకు సైతం సిద్ధంగా ఉన్నాం. – సుందర్‌ రాథోడ్, ట్రైబల్‌ స్టూడెంట్స్‌ ఫెడరేషన్‌ అధ్యక్షుడు 

మరిన్ని వార్తలు