సాక్షి, హైదరాబాద్ : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా శనివారం హైదరాబాద్లో భారీ వర్షం కురిసింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాసబ్ట్యాంక్, లక్డీకాపూల్, పంజాగుట్ట, టోలిచౌకి, దర్గా, గోల్కొండ, యూసుఫ్ గూడ, ఎర్రగడ్డ, చిక్కడపల్లి, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, విద్యానగర్, తార్నాక, కూకట్ పల్లి, మియాపూర్, ఫిల్మ్ నగర్, కొండాపూర్, బోరబండ, కొత్తగూడ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. కొన్ని చోట్ల ఈదురుగాలులకు ఫ్లెక్సీలు కూలిపడ్డాయి. పలు చోట్ల రోడ్లపైకి నీరు చేరడంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. దీంతో వాహన చోదకులు తీవ్ర అవస్థలు పడ్డారు.
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. దీంతో రానున్న 24గంటల్లో తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆది, సోమ వారాల్లో ఒక మోస్తరు వర్షాలు రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.