రాజధానిలో ఎస్కార్ట్‌ హుండీ!

12 Dec, 2016 13:53 IST|Sakshi
రాజధానిలో ఎస్కార్ట్‌ హుండీ!

నోట్ల రద్దు నేపథ్యంలో హైదరాబాద్‌లో కొత్త దందా
నగరం నుంచి ఉత్తరాదికి భారీగా వెళ్తున్న పాతనోట్లు
రూ.లక్షకు రూ.5 వేల కమీషన్‌ ఇస్తున్న బడాబాబులు
మూలాల కోసం ఆరా తీస్తున్న కేంద్ర దర్యాప్తు సంస్థలు


సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర రాజధానిలో జరిగే అక్రమ ద్రవ్య మార్పిడి వ్యవహారంలో కొత్త దందా మొదలైంది. ఎస్కార్ట్‌ హుండీగా పిలిచే ఈ పంథాలో భారీగా పాత కరెన్సీ ఉత్తరాదికి తరలివెళ్తోంది. ప్రతి రూ.లక్షకు రూ.ఐదు వేల కమీషన్‌ ఇస్తున్న బడాబాబులు తాము ఖరీదు చేసిన సెకండ్‌ హ్యాండ్‌ కార్లలోనే నగదును పంపించేస్తున్నారు.ప్రాథమిక సమా చారం అందు కున్న కేంద్ర దర్యాప్తు సంస్థలు లోతుగా ఆరా తీస్తున్నాయి.

‘సంప్రదాయానికి’ బ్రేక్‌పడటంతో..: రెండు దేశాల మధ్య జరిగే అక్రమ ద్రవ్యమార్పిడిని హవాలా అని, దే«శంలోని వివిధ ప్రాంతాల మధ్య జరిగే దాన్ని హుండీ అంటారు. నగరంలో ఈ రెండు వ్యాపారాలు జోరుగా సాగేవి. ఒకే ముఠాకు చెందిన ఏజెంట్లు వేర్వేరు ప్రాంతాల్లో ఉంటూ ఈ దందా నిర్వహిస్తుంటారు. వ్యాపారులు ఓ ప్రాంతంలోని ఏజెంట్‌కు నగదు అప్పగిస్తే.. అతడు కమీషన్‌ తీసుకుని నిమిషాల్లో మరో ప్రాంతంలో ఉన్న ఏజెంట్‌ ద్వారా దాన్ని అవసరమైన చోట డెలివరీ చేయిస్తాడు. ఈ వ్యవçహారాలు సాగడానికి రెండు చోట్లా లిక్విడ్‌ క్యాష్‌ ఉండటం తప్పనిసరి. నోట్ల రద్దుతో ఈ సంప్రదాయ దందాకు బ్రేక్‌ పడింది.

ఇక్కడ అవకాశం లేక...: నగరంలోని ప్రధాన వాణిజ్య, వ్యాపార ప్రాంతంల్లో జరిగే వ్యాపారంలో 80 శాతం జీరో దందానే.పన్నుల ఎగవేతకు ఏ దశలోనూ బిల్లులు, లెక్కలు లేకుండా రూ.కోట్లలో వ్యాపారం చేస్తుంటారు. ఈ నేపథ్యంలో వీరంతా హుండీని ఆశ్రయిస్తుంటారు. ఏ రోజు ఈ దందా జరగకపోయినా నగరంలోని వ్యాపారుల కార్యకలాపాలు పూర్తిగా ఆగిపోతుంటాయి. ఈ నేపథ్యంలో అనేక మంది బడా బాబుల వద్ద భారీగా కరెన్సీ నోట్లు నిల్వ ఉన్నాయి. గత నెల 8న వెలువడిన నోట్ల రద్దు ప్రకటన, మార్పిడికి ఈ నెల 30 వరకు మాత్రమే గడువు ఉండటం వీరి గుండెల్లో రైళ్లు పరిగెత్తించాయి. ఉత్తరాదిలో ఉన్న ముఠాలతో మిలాఖత్‌ అయి ప్రారంభించిన దందానే ఎస్కార్ట్‌ హుండీ.

కార్లలో రూ.కోట్లు దాచిపెట్టి..: ఈ దందాలో సిటీ నుంచి పాత నోట్లు ఉత్తరాదిలోని మహారాష్ట్ర, గుజరాత్‌ తదితర రాష్ట్రాలకు తరలివెళ్తున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఎస్కార్ట్‌ హుండీ విధానంలో ఉత్తరాదిలో ఉన్న ఏజెంట్ల వివరాలు నగదును పంపే వ్యాపారులకే తెలుస్తుంది. వీరు ఓ కారు/తేలికపాటి వాహనంలో పాత నోట్లును నేర్పుగా పేరు స్తారు. నమ్మకమైన వ్యక్తికి అప్పగించి  చేర్చాల్సిన ప్రాంతాన్ని చెప్తుంటారు. అతడు ఆ కారును తీసుకెళ్లి నిర్దేశిత ప్రాంతంలో పార్క్‌ చేసి, వివరాలను హైదరాబాద్‌లో ఉన్న వ్యాపారికి చెప్తాడు. అతను రిసీవ్‌ చేసుకునే వ్యక్తికి సమాచారం ఇస్తాడు.

ఆధారాలు దొరక్కుండా..: అక్కడి వ్యక్తులు నగదు ఉన్న కార్లను తీసుకువెళ్లి.. అందులోని నగదును ఖాళీ చేసి ఆ తర్వాత కారుతో వెళ్లిన వ్యక్తికి అప్పగిస్తారు. సదరు ఏజెంట్‌ ఆ వాహనాన్ని వ్యాపారికి అప్పగిస్తాడు. దీని కోసం ఏజెంట్‌కు వ్యాపారి పూర్తి ఖర్చులతో పాటు రూ.లక్షకు రూ.ఐదు వేల కమీషన్‌ ఇస్తాడు.ఆధారాలు చిక్కకుండా నగదు రవాణా  వాహనం తమ పేరిట లేకుండా ఉండేలా చూసుకుంటూ పాత సెకండ్‌ హ్యాండ్‌ కార్లను ఖరీదు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు