హామీలను అమలు చేయలేని టీఆర్‌ఎస్‌: బీజేపీ

13 Jul, 2017 16:21 IST|Sakshi
హామీలను అమలు చేయలేని టీఆర్‌ఎస్‌: బీజేపీ

హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడిచినా ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. ప్రజల తరపున పార్టీ శ్రేణులు పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. గురువారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన మహిళా మోర్చా పదాధికారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లను నగరంలో ఇప్పటికీ నిర్మించలేదని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మద్యం విధానంపై మహిళలు పెద్ద ఎత్తున ఉద్యమించాలని పిలుపునిచ్చారు.

దేశ సంస్కృతికి వ్యతిరేకంగా పెరుగుతున్న క్లబ్బులు, పబ్బుల సంస్కృతి పై పోరాడాలన్నారు. మహిళా సంక్షేమం కోసం ప్రధానమంత్రి మోదీ అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులను కోరారు. వితంతువులు కూడా సమాజంలో గౌరవంగా బతికేలా మహిళా మోర్చా కృషి చేయాలని కోరారు. సుష్మాస్వరాజ్ ను ఆదర్శంగా తీసుకోవాలని. ఈ నెల 22, 23 తేదీల్లో వరంగల్‌లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు జరుగుతాయని తెలిపారు. ఈ సమావేశంలో మోర్చా నేతలు మాజీ మంత్రి పుష్పలీల, ఆకుల విజయ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు