ఈ నెంబర్‌కు అతని వివరాలు పంపించండి: కవిత

18 Dec, 2018 14:44 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నిజామాబాద్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత మరోసారి తన పెద్ద మనసును చాటుకున్నారు. సామాజిక మాధ్యమం ట్విటర్‌ ద్వారా సాయం కోరిన ఓ వ్యక్తికి.. పూర్తి వివరాలు పంపాల్సిందిగా సూచించారు. వివరాల్లోకి వెళ్తే.. జితేందర్‌ రెడ్డి అనే నెటిజన్‌ రోడ్డు ప్రమాదానికి గురై ప్రాణపాయ స్థితిలో ఉన్న తన స్నేహితుని గురించి ఎంపీ దృష్టికి తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. ‘నా స్నేహితుడిది పేద కుటుంబం. బైక్‌ యాక్సిండెట్‌ జరగడంతో అతను ప్రస్తుతం కరీంనగర్‌లోని భద్రకాళి ఆస్పత్రిలో ప్రాణప్రాయ స్థితిలో ఉన్నారు. అక్క నా స్నేహితుకునికి మీరు సహాయం చేయగలరా’ అంటూ ట్విటర్‌లో కవితను ట్యాగ్‌ చేశారు. 

అతి తక్కువ సమయంలోనే జితేందర్‌ ట్వీట్‌పై స్పందించిన కవిత.. అతని వివరాలను ఓ ఫోన్‌ నెంబర్‌కు తెలియజేయాలని సూచించారు. దీనిపై సదురు నెటిజను కవితకు కృతజ్ఞతలు తెలిపారు. వివరాలను పంపిస్తున్నట్టుగా కూడా పేర్కొన్నారు. ఆపదలో ఉన్న వ్యక్తిని ఆదుకోవడానికి వెంటనే స్పందించిన ఎంపీపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మరో ట్వీట్‌లో జితేందర్‌ బాధితుని వివరాలు కూడా షేర్‌ చేశారు. జగిత్యాల జిల్లా గొల్లపెల్లి గ్రామానికి చెందిన ధర్మపురి మధు సోమవారం రాత్రి ప్రమాదవశాత్తు బైక్‌పై నుంచి పడిపోవడంతో తలకు బలమైన దెబ్బ తగిలి చెవుల నుంచి రక్త స్రావం జరిగడంతో ప్రస్తుతం ప్రాణప్రాయ స్థితిలో ఉన్నట్టు తెలిపారు.
 

>
మరిన్ని వార్తలు