సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పారిశ్రామిక, వ్యాపార, విద్యుత్, సాంకేతిక, పర్యాటక రంగాల అభివృద్ధి కోసమే ముఖ్యమంత్రి కేసీఆర్ సింగపూర్ వెళ్లారని ఎమ్మెల్సీలు కె.యాదవరెడ్డి, భాను ప్రసాద్, జగదీశ్వర్రెడ్డి అన్నారు. అసెంబ్లీలోని టీఆర్ఎస్ఎల్పీలో శనివారం వారు విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ పీసీసీ పదవి కోసం మాజీమంత్రి డీకే అరుణ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని విమర్శించారు. తెలంగాణలో విద్యుత్ కష్టాలకు గత కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని, దానిని దాచిపెట్టి కేసీఆర్పై విమర్శలు చేయడం తగదని హితవు పలికారు. హైదరాబాద్పై గవర్నర్కు అధికారాలపై బీజేపీ వైఖరిని ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. బీజేపీకి తెలంగాణలో ఎప్పటికీ భవిష్యత్తు ఉండదని, తెలంగాణ ప్రజలు ఆ పార్టీని పట్టించుకోరని చెప్పారు.