అబద్ధాల కేసీఆర్‌: కేంద్ర మాజీ మంత్రి మునియప్ప

4 Dec, 2018 13:58 IST|Sakshi
కాంగ్రెస్‌ భవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న కేంద్ర మాజీ మంత్రి మునియప్ప

ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు 

కేంద్ర మాజీ మంత్రి మునియప్ప

సాక్షి, నిజామాబాద్‌అర్బన్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌ పెద్ద అబద్దాల కోరు అని, ఇచ్చిన హామీలను నెరవేర్చలే దని కేంద్ర మాజీ మంత్రి మునియప్ప విమర్శించారు. సోమవారం జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్‌ ఇంటింటికీ నీళ్లు ఇస్తానని ఇవ్వలేదని, ఉద్యోగాలు ఇవ్వలేదని, ఎస్సీ, ఎస్టీలకు భూములు ఇవ్వలేదని, మైనారిటీలకు రిజర్వేషన్లు ఇవ్వలేదని మండిపడ్డారు. అబద్దపు హామీలతో మోసం చేసిన కేసీఆర్‌ను ఈ ఎన్నికల్లో  ప్రజలు ఓడించాలని పిలుపునిచ్చారు. నిజామాబాద్‌ ఎంపీ కవిత కూడా ఏ ఒక్క హామీ నెరవేర్చలేదన్నారు. తెలంగాణ తల్లి సోనియాగాంధీ అని, ఆత్మబలిదానాలను చూసి ఆమె తెలంగాణ ఇచ్చారని గుర్తు చేశారు.

ప్రత్యేక రాష్ట్రం ఇస్తే టీఆర్‌ఎస్‌ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తానని కేసీఆర్‌ మాట ఇచ్చాడని, కానీ, ఆ తర్వాత మాట మార్చాడని విమర్శించారు. పార్లమెంట్‌ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు వస్తే ఓడిపోతామనే భయంతోనే కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్లాడని విమర్శించారు. కాంగ్రెస్‌ హయాంలోనే అభివృద్ధి జరిగిందని గుర్తు చేసిన మునియప్ప.. అన్ని వర్గాలకు కాంగ్రెస్‌ పార్టీతోనే మేలు జరుగుతుందన్నారు. డీసీసీ అధ్యక్షుడు, నిజామాబాద్‌ అర్బన్‌ అభ్యర్థి తాహెర్, టీపీసీసీ నేతలు గడుగు గంగాధర్, మహేశ్‌కుమార్‌గౌడ్, కర్ణాటక రాష్ట్రంలోని ఖానాపూర్‌ ఎమ్మెల్యే అంజలిచౌహాన్, కేశవేణు, మీసాల సుధాకర్, సుభాష్‌జాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు