మంత్రి హరీశ్ వ్యాఖ్యలపై మనస్తాపం..

16 Oct, 2014 02:47 IST|Sakshi

సత్యసాయి తాగునీటి పథకం కార్మికుడి హఠాన్మరణం

సంగారెడ్డి: కనీస వేతనాలు అమలు కావేమోనన్న బెంగతో సత్యసాయి తాగునీటి పథకంలో పనిచేస్తున్న మెదక్ జిల్లా పుల్కల్‌కు చెందిన ఒక కార్మికుడు హఠాన్మరణం చెందాడు. జిల్లాలో సత్యసాయి తాగునీటి పథకంలో పనిచేస్తున్న కార్మికులు 23 రోజులుగా సమ్మె చేస్తున్నారు. కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సంగారెడ్డిలోని కలెక్టరేట్ ఎదుట నిరాహార దీక్షలు చేపడుతున్నారు. మంగళవారం కలెక్టరేట్‌కు వచ్చిన మంత్రి హరీశ్‌రావును కనీస వేతనాలు అమలు చేయాలని కోరారు.

దీంతో మంత్రి స్పందిస్తూ కనీస వేతనాలకు సంబంధించిన జీఓ 11 అమలు కుదరదని తేల్చి చెప్పడంతో నిరాశకు గురయ్యారు. సమ్మె చేస్తున్న కార్మికుల్లో పుల్కల్‌కు చెందిన ఫిట్టర్ చిన్నరాజు తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. పుల్కల్‌లోని ఇంటికి వెళ్లిన ఆయన మంగళవారం అర్ధరాత్రి హఠాన్మరణానికి గురయ్యాడు.
 
 

మరిన్ని వార్తలు