కాంగ్రెస్‌ మోసకారి పార్టీ : సీఎం కేసీఆర్‌

17 Nov, 2023 15:20 IST|Sakshi

సాక్షి, కరీంనగర్‌: కాంగ్రెస్‌ మోసకారి పార్టీ అని, ఉన్న తెలంగాణను ఊడగొట్టి ఇక్కడి ప్రజలను 60 ఏండ్లు గోస పెట్టిన పార్టీ అని బీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఫైర్‌ అయ్యారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్‌లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్‌ మాట్లాడారు. ఓటువేసేటపుడు ఆలోచించి వేయాలని కోరారు. ఎన్నికలు రాగానే ఆగం కావద్దని సూచించారు.  ఓటు వేసేటపుడు ప్రజలు కాంగ్రెస్‌ చరిత్రను  కూడా ఆలోచించి ఓటు వేయాలన్నారు. 24 గంటల కరెంట్‌ వద్దని, 3 గంటల కరెంటు చాలని కాంగ్రెస్‌ అంటోందని తెలిపారు. 3 గంటల కరెంటుతో పొలం పారుతదా అని సీఎం ప్రజలను ప్రశ్నించారు. 

‘తెలంగాణ ఉద్యమం మొదలైనప్పటి నుంచి ఎన్నో విజయాలకు కరీంనగర్‌ గడ్డ కేంద్ర బిందువైంది. తెలంగాణ ఉద్యమానికి, వ్యక్తిగతంగా తనకు ఎన్నో విజయాలను అందించిన కరీంనగర్‌ గడ్డకు తాను శిరసు వంచి నమస్కరిస్తున్నా. ఎస్‌ఆర్‌ఆర్‌ కాలేజీ గ్రౌండ్‌కు ఒక ప్రత్యేకత ఉంది. తెలంగాణ ఉద్యమ చరిత్రలో 2011, మే 17న మొట్టమొదటి సింహగర్జన సభ ఈ కాలేజీ వేదికగానే జరిగింది. తెలంగాణ రాష్ట్రం తేకపోయినా, ఉద్యమాన్ని విరమించినా నన్ను రాళ్లతో కొట్టి చంపండి అని అప్పుడు చెప్పిన. ఆ సభకు ఎవరూ ఊహించనంత మంది వచ్చి జయప్రదం చేశారు.  దళితబంధు, రైతుబంధు, రైతు బీమా లాంటి అనేక మంచి కార్యక్రమాలను కరీంనగర్‌ వేదిక నుంచే ప్రారంభించుకున్నాం

 తెలంగాణ కోసం  ఉద్యమం చేస్తే 400 మందిని కాల్చిచంపిన పార్టీ కాంగ్రెస్‌. 2004లో మనతో పొత్తుపెట్టుకుని కాంగ్రెస్‌ రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత వెంటనే తెలంగాణ ఇవ్వకుండా కాంగ్రెస్‌ నేతలు మోసం చేశారు.  14 ఏండ్లు పోరాటం చేస్తే  తెలంగాణ ఇచ్చారు. తర్వాత మళ్లీ వెనుకకు పోయారు. అంతేగాక టీఆర్‌ఎస్‌ పార్టీని చీల్చే ప్రయత్నం చేశారు. దీంతో కేసీఆర్‌ శవయాత్రనో, తెలంగాణ జైత్రయాత్రనో ఏదో ఒకటి జరగాలని నేను ఆమరణ నిరాహార దీక్ష చేపట్టాను. ఆ దీక్షకు కూడా ఈ కరీంనగరే వేదికైంది. నన్ను అలుగునూరు చౌరస్తాలో అరెస్టు చేసి ఖమ్మం జైల్లో పెట్టారు. ఇలాంటి అనేక ఉద్యమ ఘట్టాల్లో ప్రథమ స్థానంలో కరీంనగర్‌ ఉంటుంది.

 ఒక దేశమైనా, రాష్ట్రమైనా బాగుందా.. లేదా..? అని చూసేందుకు రెండు కొలమానాలు ఉంటాయి. అందులో ప్రధానమైనది తలసరి ఆదాయం. 2014లో తెలంగాణ ఏర్పడినప్పుడు తలసరి ఆదాయంలో దేశంలో మన ర్యాంకు ఎక్కడో  ఉంది. పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలన తర్వాత  తెలంగాణ 3.18 లక్షల తలసరి ఆదాయంతో దేశంలోనే నెంబర్‌ వన్‌గా ఉన్నది. కడుపు నోరు కట్టుకుని, ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తున్నం కాబట్టి ఇయ్యాల ఈ స్థాయికి వచ్చినం. అభివృద్ధికి రెండో గీటురాయి తలసరి విద్యుత్ వినియోగం. 2014లో తెలంగాణ వచ్చినంక తలసరి విద్యుత్‌ వినియోగం 1,122 యూనిట్లు.  ఇప్పుడు 2,040 యూనిట్ల తలసరి విద్యుత్ వినియోగంతో దేశంలో ప్రథమ స్థానంలో ఉన్నాం’అని కేసీఆర్‌ వివరించారు. 

ఇదీ చదవండి..తెలంగాణకు కాంగ్రెస్‌ ఏం చేసిందో నేను చెప్తా కేసీఆర్‌: రాహుల్‌

మరిన్ని వార్తలు