ప్రభుత్వ సొమ్మంటే లెక్కేలేదా?

20 Feb, 2015 04:32 IST|Sakshi
ప్రభుత్వ సొమ్మంటే లెక్కేలేదా?

బీర్కూర్ : ‘‘ప్రభుత్వ సొమ్మంటే లెక్కలేకుండా పోయింది. నాణ్యమైన సీడ్‌ను అందించాల్సిన సీడ్ ఫాంను భ్రష్టు పట్టించేశారు. పని చేయడం ఇష్టం లేకపోతే ఇంట్లో కూర్చోండి’’ అంటూ బొప్పాస్‌పల్లి విత్తనోత్పత్తి క్షేత్రం జేడీఏ నర్సింహ, ఏడీఏ సైదులులపై వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి విరుచుకుపడ్డారు. గురువారం సాయంత్రం ఆయన బొప్పాస్‌పల్లి విత్తన ఉత్పత్తి క్షేత్రాన్ని తనిఖీ చేశారు. సీడ్ ఫాంలో చేస్తున్న పనులను పరిశీలించారు. లక్షలాది రూపాయలు వెచ్చించి నిర్మిస్తున్న వాటర్ పాండ్‌లను పరిశీలించి పనులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కాలువ కంటే ఎత్తు ఎక్కువగా ఉంటే నీళ్లు ఎలా నిలువ ఉంటాయని ఆయన ఏడీఏను ప్రశ్నించారు. అనంతరం కాలువ నిర్మాణ పనులతో పాటు సీడ్‌ఫాంలో చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించారు.
 
కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విత్తన ఉత్పత్తి క్షేత్రానికి సంబంధించి అభివృద్ధి పనుల కోసం కార్యాలయం నుంచి సుమారు రూ. 2 కోట్ల నిధులు కావాలంటూ తన కార్యాలయానికి ప్రతిపాదనలు వచ్చాయన్నారు. అయితే ఈ ప్రతిపాదనలు దేనికోసం పంపించారని ఆయన ఏడీఏను ప్రశ్నించారు. 475 ఎకరాలు ఉన్న సీడ్ ఫాం భూమికి కంచె నిర్మాణం కోసం రూ. 60 లక్షలతో ప్రతిపాదనలు పంపించారని అయితే ఈ రూ. 60 లక్షలు ఎందుకు కావాలో తనకు తెలియాలని ప్రశ్నించారు. ప్రతిపాదనలు పంపిన విషయం తన దృష్టికి రాలేదని జేడీఏ సమాధానమిచ్చారు. కింది స్థాయి అధికారులు ఏ ప్రతిపాదనలు పంపుతున్నారో తెలియకపోతే మీరంతా ఎందుకు ఉన్నారంటూ మంత్రి మండిపడ్డారు.
 
పంట భూమిని నాశనం చేశారు
బ్రహ్మాండంగా పంటలు పండే భూమిని గుంతలు తవ్వి నాశనం చేశారని, పని చేయడం ఇష్టం లేకపోతే ఉద్యోగానికి రాజీనామా చేసి ఇంట్లో కూర్చోవాలని మంత్రి పోచారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక సందర్భంలో తన చేతిలో ఉన్న ఫైల్‌ను సైతం ఆయన విసిరి కొట్టారు.. ఇప్పటికే భూమి మొత్తం నాశనం అయిందని మరో రూ. 20 లక్షలు కావాలని ప్రతిపాదనలు పంపించారని, ఈ డబ్బులు ఇస్తే ఏం చేస్తారని ఆయన ప్రశ్నించారు. మంత్రి అడిగిన ఏ ప్రశ్నకూ ఏడీఏ వద్ద సమాధానం లేకపోవడంతో.. ఏం చేస్తే మీరు మారతారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సీడ్‌ఫాంలో ఉన్న బోర్లు పూర్తిగా ఎత్తిపోయాయని, వాటిని బాగు చేయించే దిక్కు లేదు కాని మరికొన్ని బోర్లు వేయడానికి నిధులు కావాలా అని నిలదీశారు.

పని చేయకుండానే జీతం తీసుకునే అలవాటు అధికారుల్లో ఎక్కువ అయ్యిందని, ఇది మంచి పద్ధతి కాదని మంత్రి పేర్కొన్నారు. గతంలో వచ్చిన నిధులతో ఏ ఏ పనులు చేశారని ఆయన ఏడీఏను అడిగారు. వంతుల వారీగా డబ్బులు పంచుకుంటూ ప్రభుత్వ సొమ్మును దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీడ్‌ఫాంకు సంబంధించిన 475 ఎకరాల్లో సుమారు 225 ఎకరాల్లో పంటలు పండించవ చ్చని, అయితే ఇంత వరకు ఒక్క ఎకరంలో అరుునా పంటలు పండించిన దాఖలాలు కనిపించడం లేదని పేర్కొన్నారు. ఈ సీడ్‌ఫాం భూమి ద్వారా రెండు జిల్లాలకు సోయా విత్తనాలు అందించవచ్చన్నారు. అయితే అధికారుల నిర్లక్ష్యం ఫలితంగా సోయా విత్తనాలు ఇతర ప్రాంతాల నుంచి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు.
 
ఏడీఏను వెంటనే మార్చండి
ప్రస్తుతం ఉన్న ఏడీఏ సైదులును వెంటనే ఇక్కడి నుంచి పంపించివేయాలని, ఆయన స్థానంలో మరో రెగ్యులర్ ఏడీఏను, ఇతర సిబ్బందిని నియమించాలని జేడీఏ నిర్సింహను మంత్రి ఆదేశించారు. సిబ్బంది స్థానికంగా ఉండేలా క్వార్టర్లకు సైతం మరమ్మతులు చేయించాలని సూచించారు.
 
మంత్రి కాలికి గాయం
సీడ్‌ఫాంను పరిశీలించేందుకు వచ్చిన మంత్రి పోచారం కాలికి కర్ర గుచ్చుకోవడంతో ఆయన స్వల్పంగా గాయపడ్డారు. వెంటనే స్థానిక నాయకులు ఆయనకు ప్రథమ చికిత్స చేరుుంచారు. ఆయన వెంట స్థానిక సర్పంచ్ రాములు, జడ్పీటీసీ సభ్యుడు కిషన్ నాయక్, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్, ఎంపీటీసీ సభ్యుడు కంది మల్లేశ్, నాయకులు సతీశ్, బస్వరాజ్, హన్మంతు తదితరులున్నారు.

మరిన్ని వార్తలు