మా దగ్గర బ్రహ్మాస్త్రం ఉంది: లక్ష్మణ్‌

16 May, 2017 18:10 IST|Sakshi
మా దగ్గర బ్రహ్మాస్త్రం ఉంది: లక్ష్మణ్‌

హైదరాబాద్‌: వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారాన్ని కైవసం చేసుకోవటం ఖాయమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ తెలిపారు. ఇందుకోసం అతి శక్తివంతమైన బ్రహ్మాస్త్రం తమ వద్ద ఉందని, అదే ప్రధానమంత్రి మోదీ అని ఆయన పేర్కొన్నారు. బ్రహ్మాస్త్రం అణుబాంబు కంటే శక్తివంతమైనదని వివరించారు. తెలంగాణ జర్నలిస్టుల యూనియన్‌ మీట్‌ది ప్రెస్‌లో ఆయన మాట్లాడారు. ఈనెల 22వ తేదీన పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా పర్యటన పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపుతుందని చెప్పారు. 

అమిత్‌షా నల్లగొండ జిల్లాలో పర్యటించటంతోపాటు హైదరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గం నాయకులతో సమావేశమవుతారని వివరించారు. ఈ నియోజకవర్గంలో 1984 ఎన్నికల నుంచి ఎంఐఎం అభ్యర్థి విజయం సాధిస్తున్నందున దీనిపై తమ నాయకత్వం దృష్టిపెట్టిందని వెల్లడించారు. అమిత్‌షా సమావేశం తర్వాత నియోజకవర్గంలోని ప్రతి ఇంటికీ వెళ్లి పార్టీ కార్యకర్తలు మోదీ ప‍్రభుత్వ చేపట్టిన కార్యక్రమాలను వివరిస్తారని చెప్పారు.

కొందరు ఎమ్మెల్యేలు అధికార టీఆర్‌ఎస్‌లోకి మారిన నేపథ్యంలో టీడీపీ, కాంగ్రెస్‌లపై ప్రజలకు నమ్మకం సన్నగిల్లిందని తెలిపారు. దీంతోపాటు ఎస్సీలు, బీసీలు, మైనారిటీలకు ఇతర పార్టీలపై విశ్వాసం తగ్గిందని వారంతా ఇప్పుడు బీజేపీ వైపే చూస్తున్నారని అన్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో తాము చేపట్టే ప్రచార కార్యక్రమాలు అధికారంలోకి వచ్చేందుకు దోహదపడతాయని లక్ష్మణ్‌ దీమా వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు