దరఖాస్తు చేసినా ఓటు రాలేదు సార్‌

5 Nov, 2018 09:38 IST|Sakshi
ఓటు ఉందో లేదోనని జాబితాను పరిశీలిస్తున్న ఓటర్లు

ఓటు రాలేదంటున్న ప్రజలు

‘చెక్‌ యువర్‌ ఓట్‌’కు స్పందన  

ఖమ్మం అర్బన్‌: ఓటు ఆయుధం లాంటిదని, ఓటు హక్కు ఉన్న ప్రతిఒక్కరూ ఓటు వినియోగించుకోవాలని ఎన్నికల సంఘం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు రాజకీయ పార్టీలకు పెద్ద సవాల్‌గా మారడంతో ప్రతి ఓటు కీలకంగా మారుతోంది. దీంతో ఓటర్ల జాబితాలో తమ పేరు ఉందో లేదో అని ప్రజలు ఎంతో ఆతృతగా పరిశీలిస్తున్నారు. గతంలో అనేక సార్లు దరఖాస్తు చేసిన వారి పేరు మళ్లీ జాబితాలో లేక పోవడంతో నిరాశతో వెనుదిరుగుతున్నారు.

ఎన్నికల సంఘం చివరి అవకాశంగా ఓటు ఉందో లేదో పరిశీలించుకోవడానికి రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్ల జాబితాను ప్రదర్శించి ‘చెక్‌ యువర్‌ ఓట్‌’ అనే కార్యక్రమాన్ని ఆదివారం ఉదయం 10 గంటల నుంచి సాయం త్రం 5 గంటల వరకు నిర్వహించింది. దీంతో ఖమ్మం నియోజకవర్గంలోని పలు పోలింగ్‌ కేంద్రా ల సందడి నెలకొంది. తమ ఓటు ఉందో లేదోనని ప్రజలు అక్కడికి చేరుకొని జాబితాను చెక్‌ చేసుకోవడం కనిపించింది.

గతంలో ఓటు నమోదు కోసం దరఖాస్తు చేసిన వారు జాబితాలో పేరు లేకపోవడం అనేక మందికి ఎదురైంది. మళ్లీ, మళ్లీ దరఖాస్తు ఇవ్వడం తప్ప పేరు మాత్రం నమోదు కావడం లేదంటూ కేంద్రాల వద్ద కొందరు అసహనం వ్యక్తంచేశారు. ఖమ్మం నియోజకవర్గంలోని 295 పోలింగ్‌ కేంద్రాల వద్ద బీఎల్‌ఓలు ఓటర్ల జాబితాను పట్టుకొని వేచి ఉన్నారు. నివాసం ఉన్న ఇంటి నుంచి ఖాళీ చేసి వెళ్తే విచారణ సమయంలో వాటిని తొలగించాలని చెప్పినా జాబితాల్లో పేర్లు అలాగే ఉంచారని కొందరు ఫిర్యాదు చేశారు.

మరిన్ని వార్తలు