విద్యుత్ ఆంధ్రప్రదేశ్‌కు నిర్వహణ తెలంగాణకు!

1 Jun, 2014 07:29 IST|Sakshi
విద్యుత్ ఆంధ్రప్రదేశ్‌కు నిర్వహణ తెలంగాణకు!

రాష్ట్ర విభజన నేపథ్యంలో పంపకాలు
సాగర్ విద్యుత్ సంఘాల ఆగ్రహం
సాగర్ జెన్‌కో నెత్తిన టెయిల్‌పాండ్ భారం

నాగార్జునసాగర్, న్యూస్‌లైన్: నాగార్జునసాగర్ ప్రాజెక్టు దిగువన కృష్ణానదిపై నిర్మిస్తున్న టెయిల్‌పాండ్ ప్రాజెక్టు నిర్వహణ సాగర్ విద్యుదుత్పాదన డివిజన్‌కే కేటాయిస్తూ హైదరాబాద్ విద్యుత్ సౌధ నుంచి ఉత్తర్వులు వచ్చినట్లు సమాచారం. అక్కడ నిర్మాణమవుతున్న విద్యుదుత్పాదక కేంద్రం నుంచి తయారయ్యే విద్యుత్ మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కేటాయిస్తూ పంపకాలు జరిగాయి. టెయిల్‌పాండ్ ప్రాజెక్టును నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం అడవిదేవులపల్లి, గుంటూరు జిల్లా మాచర్ల మండలం సత్రశాల సమీపంలో కృష్ణానదిపై నిర్మిస్తున్నారు.

2005 జూన్‌లో రూ.464కోట్ల  అంచనా వ్యయంతో ప్రాజెక్టు పనులు ప్రారంభించారు. 30 నెలల్లో ఈ ప్రాజెక్టు పూర్తి కావాల్సి ఉంది. ప్రకృతి వైపరీత్యాల నేపథ్యంలో అంచనా వ్యయం రూ.950 కోట్లకు పెరిగింది. ప్రకృతి సహకరిస్తే ఈ ఏడాది పూర్తవుతుంది. ఇక్కడ కృష్ణానదికి ఆవలి వైపున గుంటూరు జిల్లాలో విద్యుదత్పాదన కేంద్రాన్ని నిర్మిస్తున్నారు. 50 మెగావాట్ల విద్యుదుత్పాదన సామర్థ్యం కలిగి ఉంది. రోజుకు 0.14 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పాదన అవుతుంది. సంవత్సరంలో  200 రోజులు విద్యుదుత్పాదన జరిగినా 28మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తవుతుంది.

ఈ విద్యుత్‌ను సీమాంధ్రకు కేటాయించారు. విద్యుత్ ఉత్పాదన సీమాంధ్రకు వెళుతున్నప్పుడు నిర్వహణ బాధ్యత తెలంగాణ పరిధిలోని సాగర్ జెన్‌కోకు అప్పగించడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్టులో ఏడు టీఎంసీల నీరు నిల్వ ఉంటుంది. సాగర్‌లో విద్యుదుత్పాదన చేసినప్పుడు ఈ నీరు ఈ ప్రాజెక్టులోకి వస్తాయి. తిరిగి ఒక టీఎంసీ నీటిని సాగర్‌లోకి తోడుకుంటారు. కేవలం 6 టీఎంసీల నీరు డెడ్‌స్టోరేజీలో ఉంటుంది. ఇక్కడి నుంచి వెళ్లే నీరంతా పులిచింతలకు చేరుకుని అక్కడినుంచి ఆంధ్రా ప్రాంతానికే వెళుతుంది. ఒక్క టీఎంసీ నీటిని వెనుకకు తోడుకున్నందుకే దీని నిర్వహణకు అయ్యే ఖర్చుంతా తెలంగాణ భరించాల్సి ఉంటుంది.

సాగర్‌లోని విద్యుత్ కేంద్రాల పంపకం ఇలా..
నాగార్జునసాగర్‌లోని 810 మెగావాట్ల ప్రధాన విద్యుదుత్పాదన కేంద్రం, ఎడమ కాలువపైన ఉన్న 60 మెగావాట్ల సామర్థ్యం కలిగిన విద్యుదుత్పాదన కేంద్రాలు సాగర్ డివిజన్ (తెలంగాణ)కు కేటాయించారు. కుడి కాలువపై ఉన్న 90 మెగావాట్ల విద్యుదుత్పాదన కేంద్రాన్ని సీమాంధ్రకు కేటాయించారు. టెయిల్‌పాండ్ దిగువన నాగార్జునసాగర్‌కు 115 కిలోమీటర్ల దూరాన.. మేళ్లచెరువు మండలం వజినేపల్లి గుంటూరు జిల్లా పులిచింతల గ్రామాల సమీపంలో పులిచింతల ప్రాజెక్టు నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టులో నీటి నిల్వ సామర్థ్యం 48 టీఎంసీలు. నీరంతా పూర్తిగా సీమాంధ్ర ప్రాంతానికే వెళుతుంది. ఇక్కడ నిర్మించే 120 మెగావాట్ల విద్యుదుత్పాద కేంద్రాన్ని మాత్రం తెలంగాణకు కేటాయించారు.

లోయర్ సీలేరు కోసమే ఆర్డినెన్స్..
లోయర్ సీలేరు విద్యుదుత్పాదన కేంద్రం కోసమే తప్పుడు ఆర్డినెన్స్‌ను కేంద్ర ప్రభుత్వం నుంచి సీమాంధ్రులు పొందారని నాగార్జునసాగర్ విద్యుత్ ఉద్యోగుల సంఘం ఆరోపిస్తోంది. ఈ ప్రాజెక్టులో ఏడాది పొడవునా విద్యుదుత్పాదన జరుగుతుంది. మరో నాలుగు రోజుల్లో పార్లమెంటు సమావేశాలు జరగాల్సి ఉన్నప్పటికీ కక్కుర్తి పడి ఆర్డినెన్స్ తీసుకురావడంలో ఉద్దేశమేమిటని ఉద్యోగ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణరాష్ట్రాలు విడిపోతున్న సమయంలో  కేవలం ముంపుగ్రామాలే ఆంధ్రాలోకి వెళుతున్నట్లు పేర్కొన్నారని, ఇప్పుడు మండలాలు ఆంధ్రాలోకి కేటాయించి ఆర్డినెన్స్ జారీచేశారని సంఘం నాయకులు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు.

మండలాలు పేర్కొనేసరికి పోలవరం ప్రాజెక్టులో ముంపునకు గురికాని గ్రామాలు కూడా ఆంధ్రాలోకి వెళుతున్నాయి. ఈ విధంగా కాకుండా రాష్ట్ర విభజనలో పేర్కొన్న మాదిరిగా కేవలం గ్రామాలనే వదులుకుంటే మనకు ఏడాది పొడవునా 460 మెగావాట్ల విద్యుదుత్పాదన చేసే లోయర్‌సీలేరు ప్రాజెక్టు మిగులుతుందని ఉద్యోగ సంఘాలు పేర్కొన్నాయి. ఈ మేరకు తెలంగాణ కాబోయే ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావుకు వినతిపత్రం అందజేసినట్లు తెలిపాయి.

మరిన్ని వార్తలు